అంగన్​వాడీ సెంటర్లలో కందిపప్పు నో స్టాక్​

అంగన్​వాడీ సెంటర్లలో  కందిపప్పు నో స్టాక్​
  •     2 నెలలుగా నిలిచిన సప్లయ్​
  •     కొన్ని సెంటర్లలో స్థానికంగా సర్దుబాటు
  •     కామారెడ్డి జిల్లాలో ప్రతీసారి ఇదే పరిస్థితి

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని అంగన్​వాడీ సెంటర్లలో కంది పప్పు స్టాక్​లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కోసం అవసరమైన సరకుల సప్లయ్​సైతం సక్రమంగా జరగడం లేదు. పప్పు లేకుండానే కూర వండడం, చారు చేస్తుండడంతో చిన్నారులు తినడానికి ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని కొన్ని సెంటర్లలో పూర్తిస్థాయిలో పప్పు లేకపోగా, కొన్ని చోట్ల సమీపంలో స్టాక్​ఉన్న సెంటర్ల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ, మద్నూర్​ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,193 అంగన్​వాడీ సెంటర్లున్నాయి. 53,082 మంది చిన్నారులు, 6,871 మంది గర్భిణులు, 6,998 మంది బాలింతలు ఉన్నారు. 

3 నుంచి 5 మధ్య ఏళ్ల వయసున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సెంటర్లలో పౌష్టికాహారమివ్వాలి. ఇందుకోసం బియ్యం, కందిపప్పు, నూనె, బాలామృతం, మురుకులు, పాలు సప్లయ్​చేస్తారు. కందిపప్పు 3 నుంచి 5 ఏండ్ల లోపు పిల్లలకు ఒక్కోక్కరికి రోజుకు 15 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు 30 గ్రాముల చొప్పున ఇవ్వాలి. ఈ లెక్కన యాప్​లో సంబంధిత సెంటర్​ టీచర్ ​నెలాఖరున తమ వద్ద ఉన్న స్టాక్, కావాల్సిన ఇండెంట్​ఎంట్రీ చేయలి. సూపర్​వైజర్ వాటిని పరిశీలించి, సీడీపీవోల ద్వారా స్టేట్​కు ఇండెంట్ ​కోసం పంపిస్తారు.

ఇదీ పరిస్థితి..

కొన్ని నెలలుగా సెంటర్లకు కందిపప్పు సక్రమంగా సప్లయ్ కావడం లేదు. రేట్​ పెరగడం, టెండర్ల ప్రక్రియలో గందరగోళం లాంటివి సప్లయ్​పై ప్రభావం చూపుతున్నాయి. స్టేట్ లోని అన్ని సెంటర్లకు హాకా ద్వారా కంది పప్పు సప్లయ్​ చేస్తున్నారు. ఏడాది నుంచి సమస్య తలెత్తుతోంది. అయినా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్​లో కంది పప్పు సప్లయ్​ చేశారు. మే, జూన్​ నెలలకు సంబంధించి సరుకు సప్లయ్ ​కాలేదు. జూన్​నెల ఫస్ట్​వీక్​లో స్టాక్​పూర్తిగా కంప్లీట్​అయిన సెంటర్లకు  సమీపంలోని సెంటర్ల నుంచి 5 నుంచి 10 కిలోలు సర్దుబాటు చేశారు. స్టాక్​వస్తుందనే ఉద్దేశంతో స్థానికంగా సర్దుబాటు చేసినా, నెల రోజులవుతున్నా హైదరాబాద్​నుంచి సెంటర్లకు కంది పప్పు సప్లయ్​ కాలేదు. 

జిల్లాలోని 70  శాతం సెంటర్లలో కందిపప్పు స్టాక్​ లేదు. కామారెడ్డి టౌన్​తో పాటు, కామారెడ్డి, భిక్కనూరు, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, బిచ్కుంద, మద్నూర్, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట, సదాశివనగర్​మండలాల్లోని చాలా సెంటర్లలో పప్పు అందుబాటులో లేదు. కొన్ని చోట్ల 5 కిలోల కంటే తక్కువగా ఉంది. దీంతో పప్పుతో కాకుండా ఆకుకూరలు, కూరగాయలతో వండి పెడుతున్నారు. కొందరు ఉన్న పప్పును కొద్దికొద్దిగా వాడుతూ చారు కాస్తున్నారు. పప్పు లేకుండా వండితే చిన్నారులు తినడం లేదని టీచర్లు చెబుతున్నారు.

స్టాక్​ రావాల్సి ఉంది

సెంటర్లకు కంది పప్పు స్టాక్​రావాల్సి ఉంది. నెలాఖరున టీచర్లు యాప్​లో ఇండెంట్ ఎంట్రీ చేయగానే, మా స్థాయిలో పరిశీలించి స్టేట్​కు పంపుతాం. అక్కడి నుంచి స్టాక్​సప్లయ్​ చేస్తారు. జూన్​నెలకు సంబంధించిన కంది పప్పు స్టాక్ ​రాలేదు. కొందరు టీచర్లు యాప్​లో ఎంట్రీ చేయడంలో కూడా డిలే చేస్తున్నారు. 

– శ్రీలత, సీడీపీవో, కామారెడ్డి