రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్1న ఐదు భాషల్లో సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. హీరో రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ ‘ఇందులో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశా. తన తండ్రిపై విపరీతమైన ప్రేమ ఉన్న కొడుకు పాత్రలో కనిపిస్తా. యానిమల్స్ మన ఊహకు అందనివిధంగా ప్రవర్తిస్తాయి. ఇందులో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. సందీప్ ఈ కథని చాలా సహజంగా గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీశారు’ అన్నాడు. ‘నాకిది స్పెషల్ మూవీ. రణ్బీర్తో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్పీరియన్స్’ అని చెప్పింది రష్మిక.
అనిల్ కపూర్ మాట్లాడుతూ ‘సందీప్ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఎమోషన్స్కు అందరూ కనెక్ట్ అవుతారు’ అన్నారు. ‘ఇందులో నటించిన పాత్రలు లాంటివి జీవితంలో ఒక్కసారే వస్తాయి. సందీప్ వల్లే ఇది సాధ్యమైంది’ అని బాబీ డియోల్ చెప్పారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ ‘తండ్రి కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళగలడు అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్. రణ్బీర్ ఒక అద్భుతం. నాకంటే తను ఓ ఏడాది చిన్న. లేదంటే తను ఇందులో ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి కాళ్ళు మొక్కాలి. తనకు ఉన్న ఓపిక మరెవరికీ లేదు’ అని చెప్పాడు.
తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న దిల్ రాజు మాట్లాడుతూ ‘తెలుగులో ఈ చిత్రం కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నా. ట్రైలర్ చూశాక ఆ నమ్మకం ఇంకా డబుల్ అయ్యింది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమలో నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా తదితరులు పాల్గొన్నారు.