రాజకీయాలను కేసీఆర్ భ్రష్టు పట్టించారు : అన్నామలై

రాజకీయాలను కేసీఆర్ భ్రష్టు పట్టించారు : అన్నామలై

తెలంగాణలో కేసీఆర్ తన అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తి.. ఒక కుటుంబం చుట్టూ తిరుగుతోందని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని చెప్పారు. శ్రీలంకలో కూడా కుటుంబ పాలన వల్లే ఆ దేశం నాశనమైందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పడు కేసీఆర్ చాలా వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. 8 కోట్ల జనాభా కలిగిన తమిళనాడు రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల అప్పు ఉంటే.. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ర్టం రూ.6.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.

దేశమంతా ఇప్పుడు నరేంద్రమోదీ మోడల్ కోరుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతికి మోడల్ గా మారిందన్నారు. బీజేపీ హయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ .. కాంగ్రెస్ కు బీటీమ్, ఎంఐఎం.. బీఆర్ఎస్ కు బీ టీమ్ అని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు ఇన్సూరెన్స్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మినీ ఇండియాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉందని, ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే రవికుమార్ యాదవ్ కు బీజేపీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. రవికుమార్ యాదవ్ లాంటి మంచి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు.. శేరిలింగంపల్లిలో బీజేపీ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో అన్నామలై పాల్గొన్నారు. శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కు మద్దతుగా అన్నామలై ప్రచారం చేశారు.