
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం పట్టుబడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్ రావుకు సంబంధించిన గోడౌన్లో పెద్ద మొత్తంలో కల్తీ మద్యం గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు.
ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులైన జనార్ధన్ రావు సోదరుడు జగన్ మోహన్ రావు, జనార్ధన్ రావు అనుచరుడు కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో 2025, అక్టోబర్ 6న జనార్ధన్ రావు గోడౌన్లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఎక్సైజ్ శాఖ అధికారులు. తనిఖీల్లో భాగంగా జనార్ధన్ రావు గోడౌన్లో భారీగా నకిలీ మద్యం గుర్తించారు అధికారులు. అలాగే నకిలీ మద్యం బాటిల్స్కు లేబుల్స్, సీలింగ్ చేసే మిషన్లు సీజ్ చేశారు అధికారులు.
మొత్తం 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేసిన అధికారులు.. హోలోగ్రామ్ స్టిక్కర్లు, వందల కొద్దీ ఖాళీ బాటిల్స్ సీజ్ చేశారు. కేరళ మార్ట్, ఓఎస్డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోడౌన్లో స్పిరిట్, కారిమిల్ను మిక్స్ చేసి నకిలీ మద్యం తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే వేటు వేసిన విషయం తెలిసిందే.