
హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు పెంచింది. ఈ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. బుధవారం (జూలై 30) శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిందితుడు వరుణ్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ40 నిందితుడిగా ఉన్న వరుణ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డి, తదితరులను సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు బుధవారం (జులై 30) హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో A- 40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్లో భారీగా నగదు దాచినట్లు తెలుసుకున్న అధికారులు.. ఫామ్ హౌజ్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
పెట్టెల్లో భారీ ఎత్తున దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A 1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, చాణక్య 12 పెట్టె్ల్లో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకరించారు. ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. 2024 జూన్లో ఈ మొత్తాన్ని దాచినట్టు పేర్కొన్నారు. మొత్తం రూ.11 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు.
రాజ్ కేశిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది.