గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం కోసం డబ్బులు చెల్లించి మోసపోయిన మరో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్రోకర్ను డబ్బులు ఇవ్వాలని అడిగి విసిగి వేసారిన ఆ యువకుడు.. చేసిన అప్పులు తీర్చలేక గడ్డిమందు తాగి ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాది క్రితం ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం కోసం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లికి చెందిన గంగుల శేఖర్ (28) కుక్కలగూడూరు గ్రామానికి చెందిన పాలకుర్తి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతిగౌడ్, అంతర్గాం మండలం మూర్మూర్ గ్రామానికి చెందిన తిరుపతికి రూ.7 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్ఎఫ్సీఎల్లో స్టార్ కాంట్రాక్టు కంపెనీ ఆధ్వర్యంలో ఏడు నెలల పాటు డ్యూటీ చేశాడు. ఆ కాంట్రాక్టు సంస్థ గడువు ముగియడంతో చౌదరి అనే మరో కాంట్రాక్టు సంస్థకు లోడింగ్ పనులకు సంబంధించి కొత్త టెండర్ వచ్చింది. చౌదరి కాంట్రాక్టు సంస్థ సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో గంగుల శేఖర్ కూడా ఉన్నాడు. నాలుగు నెలలుగా శేఖర్కు పని లేకుండా పోయింది. అంతకుముందు ఉద్యోగం కోసం అప్పు చేశాడు. ఇప్పుడు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్రోకర్లు తిరుపతిగౌడ్, తిరుపతి వద్దకు వెళ్లి శేఖర్ చాలా సార్లు అడిగాడు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సతాయించారు. ఇటీవల శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామానికి చెందిన ముంజ హరీశ్ అనే యువకుడు ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వగా బ్రోకర్లు తిరిగి ఇవ్వకపోవడంతో కమాన్పూర్ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో బ్రోకర్ బొమ్మగాని తిరుపతిగౌడ్, మాజీ సబ్ కాంట్రాక్టర్లు గోపగోని మోహన్గౌడ్, గుండురాజును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తన నుంచి డబ్బులు తీసుకున్న తిరుపతిగౌడ్ జైలుకు వెళ్లడం, అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడగడంతో శేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని కరీంనగర్లోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు.
మంత్రి కొప్పుల బాధ్యత వహించాలి: అడ్లూరి
గంగుల శేఖర్ ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగానికి డబ్బులు పెట్టి మోసపోయిన ఘటనకు మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించి డబ్బులు ఇప్పించాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ముంజంపల్లి గ్రామంలో శేఖర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.