ఉద్యోగుల హెచ్ఆర్ఏలో కోత?
నాలుగు స్లాబ్ల విధానానికి సెలవు!
20%, 10% స్లాబ్లుగా కుదింపు.. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఫిట్మెంట్ ఎంతో తేలాకే తుది నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ కమిటీ గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు మరో షాకివ్వబోతున్నది. హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)లో కోత పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం నాలుగు స్లాబ్లుగా ఉన్న హెచ్ఆర్ఏను రెండు స్లాబ్లుగా చేసే ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ కొత్త విధానాన్ని పీఆర్సీ ప్రకటించే సమయంలోనే అనౌన్స్ చేసే చాన్స్ ఉందని ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారు. ఉద్యోగి బేసిక్ శాలరీకి అదనంగా ప్రభుత్వం హెచ్ ఆర్ ఏ ఇస్తుంటుంది. ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తీరుగా లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20 శాతం, 50 వేల జనాభా దాటిన పట్టణాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12.5 శాతంగా నాలుగు స్లాబ్ల్లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె అవసరం లేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్ ఏను కుదించింది.
గ్రేడ్ వన్ నగరాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏను 30 శాతం నుంచి 24 కు తగ్గించింది. అదే మోడల్లో రాష్ట్రంలో హెచ్ఆర్ఏను సవరించేందుకు రివ్యూ చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాల కంటే రాష్ట్రంలో ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు చెల్లిస్తున్నారని, హెచ్ ఆర్ ఏ ను తగ్గించడం తప్పేమీ కాదనే అభిప్రాయం ఆర్థిక శాఖ వర్గాల్లో ఉంది. హెచ్ఆర్ ఏ సవరిస్తే ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది? ఎంతమందికి తగ్గుతుంది? ఏయే స్లాబ్లుంటే సవరణ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది? అనే ప్రతిపాదనలపై ఇప్పటికే ఆర్థిక శాఖ నివేదికను రూపొందించింది. త్వరలో సీఎంతో జరిగే సమీక్ష సమావేశంలో ఇది చర్చకు వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే నిర్ణయం వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రెండు స్లాబ్లు?
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న హెచ్ఆర్ఏలో నాలుగు స్లాబ్ల విధానాన్ని రద్దు చేసి.. వాటి స్థానంలో రెండు స్లాబ్ల విధానాన్ని అమలు చేసే చాన్స్ ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 శాతం, మిగతా ప్రాంతాలకు 10 శాతం హెచ్ఆర్ ఏ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తోన్న ఉద్యోగులకు, నగర ప్రాంతాల్లో పనిచేసే ఎంప్లాయీస్ హెచ్ ఆర్ ఏకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిపోతుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. గత పీఆర్సీ అమలు చేసినప్పుడే గ్రేటర్ హైదరాబాద్ కు చుట్టూరా ఉన్న 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో 30 శాతం హెచ్ ఆర్ ఏ ను ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే హెచ్ఆర్ఏ స్లాబ్లను సవరించాలని ఇప్పటికే పలుమార్లు సమీక్షలో సీఎం అభిప్రాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారు.
పీఆర్సీ టైమ్లోనే ప్రకటన
పీఆర్సీ ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కమిషన్ గడువు పొడిగించటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో పీఆర్సీ ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలనే విషయంలోనూ ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కలేసుకుంది. ఒక్క శాతం ఫిట్మెంట్ కు రూ.350 కోట్ల ఖర్చు అవుతుందని,10 శాతం పిట్మెంట్ ఇస్తే ఏడాదికి రూ. 4,200 కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతుందని ఆర్థిక శాఖలోని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్చెల్లిస్తోంది. అంతకంటే ఎక్కువగానే తెలంగాణలోనూ పీఆర్సీ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ఉద్యోగ సంఘాలు ధీమాతో ఉన్నాయి. కానీ.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఫిట్మెంట్ పెంచినా.. హెచ్ఆర్ఏ కోత వేస్తే ఖజానాపై ఎంత భారం తగ్గుతుందనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. అందుకే ఫిట్మెంట్ ను బట్టే హెచ్ఆర్ఏపై నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.
For More News..