- హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి డాక్టర్ల స్టడీలో వెల్లడి
- ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ దేశస్తులపైనా అధ్యయనం
- ఆస్పత్రుల నుంచి ఇండ్లలోకి బ్యాక్టీరియా పాకిందని తేల్చిన స్టడీ
- ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీనే అంటున్న డాక్టర్లు
- దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో ప్రభుత్వాలు పనిచేయాలి: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
- హెల్త్ డిజాస్టర్ రాకుండా యాంటీ బయాటిక్స్ వాడకంపై కఠిన చట్టాలు తేవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: దేశంలో యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీ వచ్చే రోజులు అతిదగ్గర్లోనే ఉన్నాయి. మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా మందులు అమ్మేయడం.. కోళ్ల పెరుగుదల కోసం ఫారాల్లో వాడేయడం.. పాల ఉత్పత్తిలోనూ వాటి వాడకం పెరిగిపోతుండడంతో బ్యాక్టీరియాలు మందులకు లొంగకుండా తయారవుతున్నాయి. ఇదే ప్రమాదమనుకుంటే.. ఇప్పుడు మనుషుల్లోనూ మందులకు లొంగని ఆ మొండి బ్యాక్టీరియాలు చేరిపోతున్నాయి.
అవును, హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రి ఏషియన్ఇన్స్టిట్యూట్ఆఫ్గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చేసిన గ్లోబల్ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. మన దేశంలోని 83 శాతం మంది రోగుల్లో మందులకు లొంగని బ్యాక్టీరియా (మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గనిజమ్స్)ను ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు గుర్తించారు. ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ (ఈఆర్సీపీ– లివర్, పాంక్రియాటిక్ జబ్బులతో బాధపడే) రోగుల్లో ఈ మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా.. మన దేశంలోనే అలాంటి బ్యాక్టీరియాల బారిన పడినోళ్లు ఎక్కువున్నట్టు ఏఐజీ స్టడీ హెచ్చరించింది. ఏఐజీ స్టడీలో భాగంగా ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్కు చెందిన వారి శాంపిళ్లనూ పరీక్షించారు. ఇందులో మన దేశ రోగుల్లో 83 శాతం మందిలో మొండి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ఆ తర్వాత ఇటలీకి చెందిన 31.5 శాతం మంది, అమెరికాకు చెందిన 20.1 శాతం మందిలో వాటి ప్రభావం ఉన్నట్టు తేల్చారు. అత్యల్పంగా నెదర్లాండ్స్లో 10 శాతం మందిపైనే ఆ మొండి బ్యాక్టీరియా ప్రభావం ఉందని గుర్తించారు.
హై పవర్ మందులు వాడినా లొంగట్లేదు..
ఎన్ని యాంటీ బయాటిక్లు వాడినా ప్రయోజనం లేదనుకున్న సందర్భంలో.. చివరి అస్త్రంగా హైపవర్ లేటెస్ట్ యాంటీ బయాటిక్స్ వాడినా కొన్ని బ్యాక్టీరియాలు లొంగడం లేదని స్టడీలో తేల్చారు. అలాంటి రకాలే ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా న్యుమోనియా, కార్బాపీనమ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని నిర్ధారించారు. 70 శాతం మందిలో ఈ ఎష్కరీషియా కొలై, క్లెబ్సియెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లుండగా.. మరో 28 శాతం మందిలో కార్బాపీనమ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉందని గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి హైఎండ్ యాంటీబయాటిక్స్కు కూడా లొంగడం లేదని, వాటిని ట్రీట్ చేయడం కష్టతరమవుతుందని, పేషెంట్ కోలుకోవడానికీ ఎక్కువ సమయం పడుతుందని, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మన మధ్యలోనే..
ఇలాంటి మొండి బ్యాక్టీరియాలు ఇంతకుముందు వరకూ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్జరిగే సందర్భాల్లోనే కనిపించేవని రీసెర్చర్లు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు మన ఇండ్ల మధ్యకే వచ్చేశాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం యాంటీ బయాటిక్స్ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడమేనని హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో అమ్మడం, కోర్సు పూర్తయ్యే వరకు వాడకుండా మధ్యలోనే ఆపేయడం, సొంతంగా వాడడం వంటివి యాంటీబయాటిక్స్కు బ్యాక్టీరియాలు లొంగకుండా మొండిబారడానికి కారణాలవుతున్నాయంటున్నారు. ఇది ఒకరకంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని తేల్చేస్తున్నారు.
కాగా, బ్యాక్టీరియాలు మొండిగా తయారవడం.. ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్కు లొంగకపోతుండడంతో శక్తిమంతమైన, మరింత టాక్సిక్ యాంటీ బయాటిక్స్ను బలవంతంగా ఇవ్వాల్సి వస్తున్నదని ఏఐజీ హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ హార్దిక్ రుఘ్వాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆరు నియమాలు పాటించాల్సిందే..యాంటీ బయాటిక్స్కు బ్యాక్టీరియా రెసిస్టెన్స్ను తగ్గించాలంటే ఆరు నియమాలను కచ్చితంగా పాటించాల్సిందేనని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సూచించారు..
- ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ వాడొద్దు. సొంత వైద్యం, మెడికల్ షాపులు ఇచ్చే యాంటీ బయాటిక్స్ తీసుకోవద్దు. దీనిని పాటిస్తే యాంటి బయాటిక్స్ రెసిస్టెన్స్ను చాలా వరకు తగ్గించొచ్చు.
- వైరల్ జబ్బులకు యాంటీ బయాటిక్స్ రాయమనొద్దు. చాలా వరకు జ్వరాలు, సర్ది, దగ్గు, డయేరియా (విరేచనాలు) వంటివి వైరస్ ప్రభావంతో వస్తుంటాయి. వాటికి యాంటీ బయాటిక్స్ ఇచ్చినా పనిచేయవు.
- యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తే.. కోర్సును పూర్తి చేయాల్సిందే. ఆరోగ్యం మంచిగైందికదా అని మధ్యలోనే ఆ కోర్సును ఆపేస్తే.. బ్యాక్టీరియా మరింత శక్తిమంతంగా మారుతుంది. రెసిస్టెన్స్ను సంతరించుకుంటుంది.
- వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. శుభ్రమైన నీళ్లు తాగాలి. మంచి ఆహారం తీసుకోవాలి. బయటకు వెళ్లొచ్చిన తర్వాత స్నానమో లేదా సానిటైజేషనో చేసుకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడడం తగ్గుతుంది.
- అవసరమైన వ్యాక్సిన్లు వేసుకోవాలి. దీని వల్ల ఇన్ఫెక్షన్లను ముందుగానే నివారించవచ్చు. తద్వారా యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ తగ్గిపోతాయి.. సూపర్ బగ్స్ కూడా తగ్గుతాయి.
- పెంపుడు జంతువులు, పశువులకు యాంటీ బయాటిక్స్ వేయించొద్దు. వెటర్నరీ డాక్టర్ల సలహా లేకుండా వాటిని వాడకూడదు. అడ్డగోలుగా జంతువులకూ యాంటీ బయాటిక్స్ను వాడితే.. జంతువుల నుంచి మనుషులకూ ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా సోకుతుంది.
ఇప్పటికైనా మేల్కోవాలి..
యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్పై ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాల్సిన అవసరం ఉంది. కామన్ చెకప్లకు వస్తున్న వారిలోనూ హైఎండ్ మందులకు లొంగని బ్యాక్టీరియా ఆనవాళ్లున్నాయి. ఇదిప్పుడు కేవలం ఆస్పత్రులకు పరిమితమైన సమస్య కాదు. మన రోజువారీ జీవితాల్లోకీ.. మన వాతావరణంలోకీ ఈ బ్యాక్టీరియాలు చేరిపోయాయి.
ప్రస్తుతం చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకూ ట్రీట్మెంట్ అందించలేని రోజులు వచ్చే ప్రమాదం ముంచుకొస్తున్నది. దేశవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ వాడకంపై ఓ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించాలి. భవిష్యత్లో హెల్త్ డిజాస్టర్ రాకుండా యాంటీ బయాటిక్స్ వాడకంపై కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్
