
న్యూఢిల్లీ, వెలుగు: వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు నిరసనగా అను దుబే అనే యువతి పార్లమెంటు వద్ద బైఠాయించింది. ‘నా దేశంలో నేను సేఫ్ గా ఉన్నాననే ఫీలింగ్ కలగడం లేదు’ అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ నినాదాలు చేసింది. దేశంలో మహిళలకు రోజురోజుకు భద్రత కరువైపోతుందంటూ ఆందోళన చేపట్టింది. అను దుబే ఆందోళన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఢీల్లీ పోలీసులు జంతర్ మంతర్కు వెళ్లాలని సూచించారు. ఇది ఆందోళన చేసే ప్రాంతం కాదని, చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకు ససేమిరా అనడంతో అను దుబేను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత విడిచిపెట్టారు. ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ కూడా జంతర్మంతర్ వద్ద ఆందోళన చేశారు.