న్యూఢిల్లీ : ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) పాలసీలను కొనుగోలు చేయడంలో ఏజ్ లిమిట్ తొలగించడంతో హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ మరింతగా విస్తరిస్తుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. మెడికల్ ఖర్చుల భారం తగ్గుతుందని చెబుతున్నారు. గత గైడ్లైన్స్ ప్రకారం 65 ఏళ్ల వయసు వరకు మాత్రమే కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి వీలుండేది. తాజాగా ఈ లిమిట్ను ఐఆర్డీఏఐ తొలగించింది. దీంతో ఏ వయసు వారైనా కొత్త ఇన్సూరెన్స్ పాలసీని కొనడానికి అర్హులే. ‘అందరికి అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కంపెనీలు తీసుకురావాలి.
సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్లు, పిల్లల కోసం స్పెషల్గా పాలసీలను తీసురావొచ్చు’ అని ఐఆర్డీఏఐ పేర్కొంది. క్యాన్సర్, హార్ట్ ఫెయిల్యూర్, ఎయిడ్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మడాన్ని నిరాకరించకూడదు. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ట్రావెల్ పాలసీలను కూడా ఆఫర్ చేయొచ్చు. పాలసీహోల్డర్ల సౌకర్యార్ధం ప్రీమియం పేమెంట్స్ను ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి అనుమతి ఇవ్వొచ్చు. ఆయూష్ ట్రీట్మెంట్ కవరేజ్లో ఎటువంటి లిమిట్ లేదని ఐఆర్డీఏ పేర్కొంది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, ఉనాని, సిద్ధా కింద జరిగే ట్రీట్మెంట్స్కు సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ వరకు కవరేజ్ ఇవ్వాలి.