
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ కు బయలుదేరారు. తన కేబినెట్ సహచర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం పాలు కావడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. గౌతమ్ రెడ్డికి నివాళులర్పించేందుకు హైదరాబాద్ కు బయల్దేరారు. ఇవాళ ఉదయం 9.45 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డి హైదరాబాద్ జూబ్లి హిల్స్ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. రేపు మంగళవారం తనతో అపాయింట్ మెంట్ తీసుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇతర ముఖ్యమైన మంత్రివర్గ సహచరులతో కలసి ఆయన హైదరాబాద్ బయలుదేరారు. నేరుగా మేకపాటి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దుబాయ్ ఎక్స్ పో లో వారం రోజులపాటు పాల్గొని రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో మేకపాటి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
దుబాయ్ ఎక్స్ ను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలడంతో జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులకు అప్పటికే సమాచారం ఇవ్వడంతో సిద్ధంగా ఉన్న వైద్యులు మేకపాటికి సీపీఆర్ చేస్తూ బతికించేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల హుటాహుటిన మేకపాటి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరికాసేపట్లో జగన్ కూడా మేకపాటి నివాసానికి చేరుకోనున్నారు.