తెలంగాణ ఇస్తెనే మేం ఇస్తం..ప్రాజెక్టుల డీపీఆర్ లపై ఏపీ షరతు

తెలంగాణ ఇస్తెనే మేం ఇస్తం..ప్రాజెక్టుల డీపీఆర్ లపై ఏపీ షరతు
  • అట్లయితేనే సంగమేశ్వరంపై చర్చలు
  • కృష్ణా, గోదావరి బోర్డులకు అందిన ఎజెండా
  • కాళేశ్వరం సహా మిగతా ప్రాజెక్టులను ఆపేయాలి
  • రాయలసీమ తాగునీటి కోసమే సంగమేశ్వరం
  •  బచావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవార్డు కేటాయింపులకు లోబడే నీటిని తీసుకుంటామన్న ఏపీ

హైదరాబాద్‌, వెలుగు:  తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించాకే సంగమేశ్వరం లిఫ్ట్‌ డీపీఆర్‌ను ఇస్తామని ఆంధ్రప్రదేశ్ కొత్త మెలిక పెట్టింది. కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) మీటింగ్‌లలో చర్చించాల్సిన ఎజెండాలను ఆయా బోర్డులకు అందజేసింది. వివాదాస్పద పోతిరెడ్డిపాడు విస్తరణ డీపీఆర్‌ముచ్చటే ఎజెండాలో పేర్కొనలేదు. అపెక్స్‌కౌన్సిల్‌ఆమోదం పొందే వరకు ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టొద్దనే కేంద్రం ఆదేశాలను అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయం తీసుకుంది. గురు, శుక్రవారాల్లో జరిగే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మీటింగుల్లో తెలంగాణను ఇరుకున పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

కాళేశ్వరంతో పోలవరానికి నష్టం

గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం, తుపాకులగూడెం, దేవాదుల ఫేజ్‌–3, సీతారామ లిఫ్ట్‌స్కీములన్నీ అక్రమమేనని ఏపీ మరోసారి ఆరోపించింది. గోదావరి నదిలో 954 టీఎంసీల వాటా తమకు ఉన్నట్టు తెలంగాణ చెప్పుకుంటోందని, దానిని అధికారికంగా నిర్ధారించాల్సి ఉందని బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించనుంది. పోలవరం ప్రాజెక్టుకు నష్టం చేకూర్చే కాళేశ్వరం సహా మిగతా ప్రాజెక్టులను ఆపేయాలని, ఈ విషయంలో కేంద్రం ఆదేశాలు పాటించేలా బోర్డు వ్యవహరించాలని పట్టుబట్టనుంది.

సీమకు తాగునీటి కోసమే సంగమేశ్వరం

కరువు ప్రాంతమైన రాయలసీమకు తాగునీటి కోసమే సంగమేశ్వరం లిఫ్ట్‌స్కీంను ప్రతిపాదించామని, బచావత్‌అవార్డులో రాష్ట్రానికి చేసిన కేటాయింపులకు లోబడే అక్కడి నుంచి నీటిని తీసుకుంటామని కేఆర్‌ఎంబీకి ఇచ్చిన ఎజెండాలో ఏపీ పేర్కొంది. పోతిరెడ్డిపాడు విత్‌డ్రాయల్స్‌విషయంలోనూ గతంలో చేసిన వాదనను ప్రస్తావించింది. తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పిస్తే.. సంగమేశ్వరంపై చర్చలకు తాము సిద్ధమని, డీపీఆర్‌లు ఇవ్వకుంటే దానిపై మాట్లాడేదే లేదని తెగేసి చెప్పింది. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులన్నీ నిండి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వరద పోతున్న రోజుల్లో తీసుకునే నీటిని రాష్ట్ర కోటాలో లెక్కించకుండా మినహాయించాలని కోరింది. ఫ్లడ్‌వాటర్‌యూసేజీపై సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన టెక్నికల్‌కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించాలని, వరద జలాల్లో తమ రాష్ట్ర వాటాను తేల్చాలని బోర్డును కోరింది.

ఎడమ కాలువ నష్టాలపై పేచీ

నాగార్జునసాగర్‌ఎడమ కాలువకు విడుదల చేస్తున్న నీటిలో తెలంగాణ ప్రభుత్వం ఏటా 39.41 నుంచి 43.67 శాతం నష్టంగా చూపిస్తోందని, దీంతో తమ రాష్ట్రానికి రావాల్సిన నీటిలో కోత పడుతుందని ఏపీ పేర్కొంది. ఎడమ కాలువలో ఏ మేరకు నీటి నష్టం ఉందో నిర్ధారించడానికి టెక్నికల్‌కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డును ఏపీలో ఏర్పాటు చేయాల్సి ఉందని, వెంటనే హైదరాబాద్‌నుంచి తమ రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరనుంది.

మన ఎజెండా ఇంకా ఇవ్వలే

కృష్ణా, గోదావరి బోర్డు సమావేశాలు ఉండటంతో రెండు రోజులపాటు ఇంజనీర్లతో సీఎం కేసీఆర్‌రివ్యూ చేశారు. పలు సూచనలు చేశారు. కానీ బుధవారం సాయంత్రం వరకు కూడా రెండు బోర్డులకు తెలంగాణ ఎజెండా అందలేదు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీకి ఇవ్వాల్సిన ఎజెండాను వారం రోజుల క్రితమే రూపొందించినా బోర్డులకు పంపకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎజెండాలోని అంశాలను మీటింగ్‌సమయంలోనూ చేర్చడానికి అవకాశం ఉండటంతో అప్పటికప్పుడే ప్రస్తావించే అవకాశముందని తెలుస్తోంది.