ఆ బాలిక పేరు మీయిదాయిబాహన్ మెజావ్… వయసు తొమ్మిదేళ్లు.. చదువుతోంది నాలుగో తరగతి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్కు చెందిన ఆ అమ్మాయి స్కూల్లో వేధింపులను ఎదుర్కొంది. తోటి స్టూడెంట్స్ ఆమెను తరచూ ఏడిపించేవారు. ఆమె స్నేహితులకూ అలాంటి పరిస్థితులే ఎదురవడం చూసి చలించిపోయింది. దీనికి పరిష్కారంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ యాప్ రూపొందించాలని అనుకుంది. వెంటనే యాప్ డెవలప్ మెంట్ కోర్సులో చేరిపోయింది. కొద్ది నెలల్లోనే అది పూర్తి చేసి ‘యాంటీ బుల్లీయింగ్’ యాప్ను రూపొందించింది. బాధితులు తమ వివరాలు తెలపకుండా తాము ఎదుర్కొన్న సమస్యలను పేరెంట్స్, టీచర్లు, ఫ్రెండ్స్కు తెలియజేసేలా దీన్ని తయారు చేసింది. తద్వారా ఇలాంటి అల్లరి పనులు చేస్తున్న స్టూడెంట్లపై చర్యలు తీసుకునేలా సొల్యూషన్ కనుక్కుంది. త్వరలోనే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులోకి రానుంది. మేఘాలయ ఎడ్యుకేషన్ మినిస్టర్ మెజావ్ను ప్రత్యేకంగా అభినందించారు.
మెసేజ్తో సమాచారం
‘‘నేను నర్సరీ నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నాను. అవి నాపై ఎంతో ప్రభావం చూపాయి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఈ యాప్ తయారు చేశా” అని మెజావ్ చెప్పింది. ‘‘ఒకసారి నలుగురైదుగురు స్టూడెంట్లు నన్ను చుట్టుముట్టారు. నా స్నేహితులను వెళ్లిపొమ్మని బెదిరించారు. అందులో ఒకడు నా పాదంపై తొక్కాడు” అని తనకు ఎదురైన సంఘటన గురించి వివరించింది మెజావ్. ‘‘యాప్ యూజర్లు తమకు ఎదురైన సంఘటన వివరాలు, వారిని ఏడిపించిన వ్యక్తి పేరుతో సహా తాము చెప్పాలనుకుంటున్న వారికి మెసేజ్ ద్వారా చెప్పొచ్చు”అని తెలిపింది. తమ రిసార్ట్ కోసం ఓ యాప్తో పాటు 40 యాప్స్ తయారు చేస్తోందట మెజావ్.