స్మార్ట్ వాచీలు తెస్తోంది యాపిల్​ 

స్మార్ట్ వాచీలు తెస్తోంది యాపిల్​ 

ప్రొడక్ట్ ఏదైనా సరే... యూజర్ల సేఫ్టీ, ప్రైవసీకి టెక్ కంపెనీలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. అందుకనే ట్రెండ్​ని బట్టి, అవసరాల్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటాయి. యాపిల్ కూడా  త్వరలోనే కొత్త అప్​డేట్స్​ని తీసుకురాబోతోంది. వాటిలో ముఖ్యమైనది మాల్​వేర్ ​హ్యాకర్ల బారిన పడకుండా చూసేందుకు ‘లాక్​డౌన్ మోడ్​’  ఫీచర్. ​ ప్రమాదాన్ని గుర్తించి యూజర్లకు అలర్ట్స్​ పంపించే ఎయిర్​పాడ్స్​ తీసుకురానుంది. ఇవేకాకుండా పెద్ద స్క్రీన్, బ్యాటరీ ఉన్న స్పోర్ట్స్​ వాచీలు కూడా తెస్తున్నట్టు చెప్పింది యాపిల్. స్మార్ట్​ఫోన్​లో స్పైవేర్, మాల్​వేర్​కి కారణమయ్యే పెగాసస్​ వంటి కంపెనీ హ్యాకర్ల నుంచి సెక్యూరిటీ కోసం ‘లాక్​డౌన్​’ ఫీచర్​ తీసుకురాబోతోంది యాపిల్. ఈ ఫీచర్​  యూజర్ల సమాచారం, వివరాలు ​ హ్యాకర్ల బారిన పడకుండా చూస్తుంది. ఇదెలా పనిచేస్తుందంటే... స్మార్ట్​ఫోన్​లోకి హ్యాకర్లు ఈజీగా యాక్సెస్ అయ్యే  దారుల్ని మూసేస్తుంది. ముఖ్యమైన మెసేజ్​ ఫైళ్లని, ఫేస్​టైమ్​ నుంచి వచ్చే సర్వీస్​ రిక్వెస్ట్​లను బ్లాక్​  చేస్తుంది. జావా స్క్రిప్ట్​ని డిసేబుల్ చేసి, కంప్యూటర్​తో యాపిల్ ఫోన్​కి ఉన్న వైర్ కనెక్షన్​ని బ్లాక్ చేయడం ద్వారా యూజర్ల వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా చూస్తుంది. ఈ ఫీచర్​ ఐఫోన్​తో పాటు ఐపాడ్, మ్యాక్​లో కూడా పనిచేస్తుంది.  అంతేకాదు, యాపిల్​లో మాల్​వేర్​ని కనిపెట్టినవాళ్లకు రెండు మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు రెడీగా ఉంది. అయితే, ఈ ఫీచర్​ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది చెప్పలేదు.

అలర్ట్​ చేసే ఎయిర్​ పాడ్స్​
ప్రమాదాన్ని ముందే పసిగట్టి, అలర్ట్ చేసే ఎయిర్​పాడ్స్​ తయారుచేయనుంది. ఈ సేఫ్టీ ఫీచర్​ మీద పేటెంట్​ కూడా తీసుకుంది యాపిల్. ఏదైనా ప్రమాదం ఎదురయ్యేముందు అలర్ట్ చేస్తుంది. అదెలాగంటే... ట్రాఫిక్​లో, జనం ఎక్కువ ఉన్నచోట  ఇయర్​బడ్స్ పెట్టుకొని పాటలు వింటుంటే బయటి శబ్దాలు వినిపించవు. అప్పుడు ఈ ఎయిర్​పాడ్స్​ ఆటోమెటిక్​గా వాల్యూమ్​ని తగ్గిస్తాయి. పాజ్ కూడా చేస్తాయి. అందుకోసం ఐఫోన్ లేదా యాపిల్ వాచీలోని జీపిఎస్ డేటాని ఎయిర్​పాడ్స్​లో ఉన్న సెన్సర్లతో కలుపుతుంది. యూజర్లు బైక్​ నడుపుతున్నా, సైకిల్ తొక్కుతున్నా ఎంత స్పీడ్​గా వెళ్తున్నారు?  వాళ్లు ఉన్న లొకేషన్? ఒక ఎయిర్​ ప్యాడ్ పెట్టుకున్నారా? రెండు ఎయిర్​ప్యాడ్స్ పెట్టుకున్నారా? అనే దాన్ని బట్టి అలర్ట్స్​ వస్తాయి. 
 

స్పోర్ట్స్​ వెర్షన్​ వాచీలు 
త్వరలోనే  స్పోర్ట్స్​ వెర్షన్​ వాచీలు తీసుకురానుంది యాపిల్. స్టాండర్డ్​ యాపిల్ వాచీలతో పోలిస్తే వీటి స్క్రీన్, బ్యాటరీ పెద్దగా ఉంటాయి. వీటి తయారీలో అల్యూమినియం బదులు మెటల్​ వాడతారు. వీటి డిస్​ప్లే 2 ఇంచులు ఉంటుంది. రెజల్యూషన్ కూడా 502 పిక్సెల్ ఉండనుంది. వీటిలో ఎస్​8 ప్రాసెసర్​ వాడతారు. ఈ వాచీల స్క్రీన్​ పెద్దగా ఉండడంతో  యాపిల్​ క్లౌడ్ మరిన్ని ఫిట్​నెస్ వివరాలు చూపిస్తుంది. ముఖ్యంగా అథ్లెట్లకు ఫిట్​నెస్ సమాచారం తెలుసుకునేందుకు ఈ వాచీ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, యూజర్ల బాడీ టెంపరేచర్​ని బట్టి  జ్వరం ఉందా?  లేదా? అనేది చెప్తుంది. వీటితో పాటు ఈ ఏడాది చివరికల్లా కొత్తగా మూడు 8 సిరీస్​ వాచీలు తేనుంది యాపిల్. 

ఇవి బడ్జెట్​ ట్యాబ్లెట్స్​ 
లాక్​డౌన్​ టైం నుంచి ఆన్​లైన్ క్లాస్​లకు అలవాటు పడ్డారు పిల్లలు. దాంతో వాళ్లకోసం స్మార్ట్​ఫోన్ లేదా ట్యాబ్లెట్ కొన్నారు చాలామంది తల్లిదండ్రులు. అప్పుడు కొననివాళ్లు తక్కువ బడ్జెట్​లో మంచి ట్యాబ్లెట్స్ దొరికితే బాగుండు అనుకుంటారు. అలాంటివాళ్ల కోసమే ఈ బడ్జెట్ ట్యాబ్లెట్స్. కంపెనీ, ఫీచర్లని బట్టి ధర ఉంటుంది.

వాటిలో కొన్నింటి వివరాలివి...
యాపిల్ ఐపాడ్ 9వ జనరేషన్​: దీనిలో ట్రూ టోన్ టెక్నాలజీ ఉన్న 10.2 ఇంచు రెటీనా డిస్​ప్లే ఉంటుంది. దాంతో వీటిలో ఫొటోలు, వీడియోలు నేచురల్​గా కనిపిస్తాయి. ఇందులోని పవర్​ఫుల్ ఎ13 బయోనిక్ చిప్  వల్ల ఇవి 20 శాతం మెరుగ్గా పనిచేస్తాయి. క్రోమ్​బుక్​తో పోల్చితే వీటి టచ్​ స్పీడ్​ 3 రెట్లు ఎక్కువ. అంటే... ఆండ్రాయిడ్​ ట్యాబ్లెట్ల కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఒఎస్​ 15 ఉన్న వీటిలో సెంటర్​ స్టేజ్​ ఫీచర్ ఉంటుంది. దాంతో యూజర్లు జూమ్​ కాల్​లో అటుఇటు కదిలినా కూడా డిస్​ప్లే విండో మధ్యలో కనిపిస్తారు. వీటిలో వైఫై మోడల్స్  రూ. 30 వేల నుంచి దొరుకుతున్నాయి. 
నోకియా టి20... వీటి డిస్​ప్లే10.36 ఇంచులు ఉంటుంది, 2,000.1,200 పిక్సెల్ రెజల్యూషన్​ ఉన్న ఎల్​సిడి కెమెరా ఉంటుంది. ఐపి(ఇంగ్రెస్ ప్రొటెక్షన్ కోడ్)54 ఉండడంతో వీటిమీద దుమ్ము, నీళ్లు పడినా పాడుకావు.  8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8,200 ఎంఎహెచ్​బ్యాటరీ ఉంటుంది. వీటిలో 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ఉన్న వాటి ధర రూ. 15,499. 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఉన్న వాటి ధర రూ.16,499.