న్యూఢిల్లీ : ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ కింద యాపిల్ ఫోన్లను తయారు చేసే కంపెనీలు, వీటికి కాంపోనెంట్లను అందించే కంపెనీలు దేశంలో భారీగా ఉద్యోగాలను క్రియేట్ చేశాయి. 2021, ఆగస్ట్ తర్వాత ఈ కంపెనీలు ప్రత్యక్షంగా 50 వేల ఉద్యోగాలను, పరోక్షంగా లక్ష ఉద్యోగాలను క్రియేట్ చేశాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగట్రాన్లు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ కింద లోకల్గా యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. మరోవైపు వీటికి కాంపోనెంట్లను సప్లయ్ చేసే సన్వొడా, అవరీ, ఫాక్స్లింక్, సాల్కాంప్లు కూడా దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. యాపిల్ సప్లయర్లు ఇచ్చిన డైరెక్ట్ జాబ్లలో 40 శాతం ఒక్క ఫాక్స్కాన్ కంపెనీనే ఇచ్చింది.
ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో యాపిల్ సప్లయర్లే ఎక్కువ బ్లూకాలర్ ఉద్యోగాలను ఇచ్చారు. కాగా, పీఎల్ఐ స్కీమ్ కింద బెనిఫిట్స్ పొందే కంపెనీలు ఎంత మందికి తాము ఉద్యోగాలు ఇస్తున్నామో ప్రభుత్వానికి ప్రతీ క్వార్టర్ తెలియజేయాల్సి ఉంటుంది. పీఎల్ఐ కింద ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన శామ్సంగ్ కూడా 11,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రభుత్వం వర్గాలు వివరించాయి. టాటా గ్రూప్ కూడా ఐఫోన్, ఇతర స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలకు కాంపోనెంట్లను అందించడానికి హోసుర్లో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ గ్రూప్ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని అంచనా. వచ్చే 18 నెలల్లో ఈ నెంబర్ను 45 వేలకు పెంచుతామని పేర్కొంది. విస్ట్రన్తో కలిసి ఐఫోన్లను తయారు చేసే ప్లాన్లో కూడా
టాటా గ్రూప్ ఉంది.