
- ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్
- ఎస్జీటీ పోస్టులకు ఇంటర్ లో పాస్ పర్సంటేజీ 40కు తగ్గింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. సోమవారం డీఎస్సీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు. జిల్లాల్లో సబ్జెక్టులు, కేటగిరి, మీడియం వారిగా వివరాలు వెల్లడించారు. మరోపక్క జనరల్ టీచర్ పోస్టుల సిలబస్, క్వాలిఫికేషన్ వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గతనెల 29న డీఎస్సీ–2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్, 6508 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 727 భాషా పండితులు, 182 పీఈటీ పోస్టులు ఉన్నాయి.
వాటితో పాటు స్పెషల్ టీచర్ల కేటగిరిలో 796 ఎస్జీటీ, 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈనెల 4 నుంచి వచ్చే నెల 3 వరకూ ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. కాగా, సోమవారం తొలిరోజు సాయంత్రం వరకూ 288 మంది అప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు.
డీఈడీ వారికే ఎస్జీటీ పోస్టులు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని అధికారులు స్పష్టం చేశారు. పీఈటీ పోస్టులకు మినహా అన్ని రకాల పోస్టులకు టెట్ తప్పనిసరని వెల్లడించారు. ఈసారి నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని ఖాళీలనూ అందరూ అప్లై చేసుకునేలా అవకాశం కల్పించారు. స్థానికతను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి డీఎస్సీలోనూ హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ లెక్కన మహిళలకు ప్రత్యేక పోస్టులు కేటాయించకుండా, ఉన్న పోస్టుల్లోనే 33 శాతం వారికి కేటాయిస్తారు. మరోపక్క గతంలో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 45 శాతం పాస్ మార్కులనే నిబంధన ఉండగా దాన్ని 40 శాతానికి తగ్గించారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు..
డీఎస్సీ అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు, వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ సపోర్ట్ కోసం 91541 14982, 63099 98812 నంబర్లు ఇచ్చారు. దీంతో పాటు helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్ ద్వారా సమస్యను వివరించవచ్చని వెల్లడించారు.
పాతోళ్లకు ఎడిట్ ఆప్షన్
డీఎస్సీ–2023 కోసం దరఖాస్తు చేసుకున్న 1.77 లక్షల మంది అభ్యర్థులు.. మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే, అప్పట్లో లోకల్ పోస్టులు తక్కువగా ఉండడం, అసలే లేకపోవడంతో చాలా మంది నాన్ లోకల్ కేటగిరిలో అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం పోస్టు లు పెరగడంతో జిల్లాలు మారడానికి అభ్యర్థు లకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి రానున్నది.
తెలుగు మీడియం పోస్టులు 8929
రాష్ట్రంలో 11,062 పోస్టులతో డీఎస్సీ వేయగా, దాంట్లో 80 శాతం పోస్టులు తెలుగు మీడియం పోస్టులే ఉన్నాయి. అత్యధికంగా తెలుగు మీడియంలో 8929 , తర్వాత ఉర్దూ మీడియంలో 1183 పోస్టులు ఉన్నాయి. తెలుగు మీడియంలో జనరల్ ఎస్జీటీలు 5481, స్పెషల్ ఎడ్యుకే షన్ ఎస్జీటీ పోస్టులు 731 ఉండగా, స్కూ ల్ అసిస్టెంట్ పోస్టులు 2209, లాంగ్వేజీ పండిట్ పోస్టులు 367, పీఈటీ పోస్టులు 141 ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం పోస్టు లు 388 ఉంటే, ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇక బెంగాలీలో 16 పోస్టులు ఉండగా అవన్నీ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. తమిళంలో ఐదు పోస్టులుంటే అవి హైదరాబాద్లోనే ఉన్నాయి. మరాఠి మీడియంలో 64 పోస్టు లుంటే, వాటిలో 43 ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి.