హైదరాబాద్, వెలుగు: ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. 58, 59 జీవోల ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్కు మరో అవకాశమిస్తూ ఈ నెల 14న రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు సోమవారం విడుదలయ్యే అవకాశముంది. సోమవారం నుంచి మార్చి 31 వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. జీవో 58 ప్రకారం 125 గజాల్లోపు ఇండ్ల స్థలాలను ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేయనున్నారు. ఇలాంటి స్థలాలను ఆయా కుటుంబాల ఆధీనంలో ఉండాలే తప్పా భవిష్యత్లో అమ్ముకోవడానికి వీల్లేదు. జీవో నంబర్ 59 ప్రకారం.. ఇంటి స్థలం 125 గజాలకు మించి ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి స్థలాలను భవిష్యత్లో అమ్ముకునే వీలు ఉంటుంది.
దరఖాస్తుకు అవరసమయ్యే పత్రాలివే..
ఇండ్ల స్థలాలను రెగ్యులరైజేషన్ చేసుకునే వారు దరఖాస్తుదారుడికి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/పాస్పోర్ట్/బ్యాంకు పాస్బుక్లలో ఏదో ఒకటి తీసుకెళ్లాలి. అలాగే భూమి తమ స్వాధీనంలో ఉందనేందుకు రిజిస్ట్రేషన్ పేపర్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికెట్ తదితర ప్రూఫ్స్లో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రూఫ్స్ తీసుకెళ్లొచ్చు. గతంలో ఆక్రమణదారుకు ప్రభుత్వం నుంచి ఏవైనా నోటీసులు వచ్చి ఉంటే, ఆ కాపీలను, కోర్టు కేసులు ఉంటే వాటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.