- రీసెర్చ్లో 25 ఏండ్ల ఎక్స్పీరియన్స్
- లిథియం బ్యాటరీ రంగంలో విశేష కృషి
న్యూఢిల్లీ: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కళైసెల్వి నియమితులయ్యారు. సీఎస్ఐఆర్కు నల్లతంబియే తొలి మహిళా డైరెక్టర్ జనరల్ కావడం విశేషం. దేశ వ్యాప్తంగా 38 రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. ఏప్రిల్లో శేఖర్ మండే రిటైర్ కావడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రటరీ రాజేశ్ గోఖలే సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. లిథియం బ్యాటరీ రంగంలో కళైసెల్వి చేసిన విశేష కృషికి గాను గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆమె.. తమిళనాడు కారైకుడిలోని సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం సీఎస్ఐఆర్ డైరెక్టర్గా నియమిస్తూ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. రెండేండ్లపాటు ఆమె పదవిలో కొనసాగుతారని పేర్కొంది. ఫిబ్రవరి 2019లో సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్– సీఈసీఆర్ఐ) చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా సైంటిస్ట్గానూ ఆమె రికార్డుకెక్కారు. ఇదే ఇనిస్టిట్యూట్లో ఆమె ఎంట్రీ లెవల్ సైంటిస్ట్గా కెరీర్ప్రారంభించారు. తమిళనాడు.. తిరునల్వేలి జిల్లాలోని అంబసముద్రంలో జన్మించిన కళైసెల్వి.. రీసెర్చ్లో 25 ఏండ్లకు పైగా అనుభవం గడించారు. ముఖ్యంగా ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్పై ఆమె దృష్టి పెట్టారు. ఎలక్ట్రో మెటీరియల్ డెవలప్మెంట్కు కృషి చేశారు. కళైసెల్వి వద్ద 125కు పైగా రీసెర్చ్ పేపర్లు, 6 పేటెంట్ హక్కులు ఉన్నాయి.