
న్యూఢిల్లీ: ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో సర్వీసెస్ సెక్టార్ సాయంతో దేశ జీడీపీ 7.8 శాతం గ్రోత్ సాధించింది. గత నాలుగు క్వార్టర్లలో చూస్తే ఈ గ్రోతే అత్యధికం. ముఖ్యంగా సేవల రంగం రెండంకెల గ్రోత్ రికార్డు చేసింది. ఫలితంగా ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఎకానమీ కిరీటాన్ని ఇండియా నిలబెట్టుకుంది. 2022–23 మొదటి క్వార్టర్లో జీడీపీ గ్రోత్13.1 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడు క్వార్టర్లలోనూ జీడీపీ గ్రోత్ వరసగా 6.2, 4.5, 6.1 శాతంగా రికార్డయింది.
2023–24 ఫైనాన్షియల్ ఇయర్ క్యూ1 లో చైనా జీడీపీ గ్రోత్ రేటు 6.3 శాతం కంటే మన దేశ జీడీపీ గ్రోత్ రేటు ఎక్కువగా అంటే 7.8 శాతం గా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఈ తాజా డేటాను గురువారం రిలీజ్ చేసింది. మొదటి క్వార్టర్లో గ్రాస్ వాల్యూ ఎడిషన్ (జీవీఏ) పరంగా అగ్రికల్చర్ రంగం 3.5 శాతం, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు 12.2 శాతం గ్రోత్ రికార్డు చేశాయి. మాన్యుఫాక్చరింగ్ రంగంలో గ్రోత్ రేటు కిందటేడాది క్యూ1 లో 6.1 శాతమైతే, ఈ క్యూ1 లో 4.7 శాతానికి పడిపోయింది.
వర్షం తక్కువైనా జీడీపీ గ్రోత్ 6.5 శాతానికి..
వర్షపాతం తక్కువైనా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ (2023–24) లో దేశ ఎకానమీ 6.5 శాతం గ్రోత్ రేటు సాధిస్తుందని చీఫ్ ఎకనమిక్ ఎడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. రేట్ల పెరుగుదల (ఇన్ఫ్లేషన్) చేయి దాటిపోతుందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఆర్బీఐ, ప్రభుత్వం ధరలు అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. మార్కెట్లోకి తాజా స్టాకులు రావడంతో ఫుడ్ ఇన్ఫ్లేషన్( ఆహార వస్తువుల రేట్లు) తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో తక్కువగా పడిన వర్షాల ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉందని అన్నారు.