- హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి, నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం
- నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే.. విచారణ జనవరి 21కి వాయిదా
న్యూఢిల్లీ: ఆరావళి పర్వత శ్రేణులపై కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ ఇచ్చిన డెఫినేషన్(నిర్వచనం)కు ఓకే చెప్తూ నవంబర్ 20న ఇచ్చిన తన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని మరింత లోతుగా స్టడీ చేసేందుకు నిపుణులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పర్వత శ్రేణులు ఉన్న రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఆరావళి పర్వతాలు అంటే.. 100 మీటర్ల కంటే ఎత్తునున్నవి మాత్రమే అని గతంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారుల కమిటీ సిఫార్సులు చేయగా, వాటికి అంగీకరిస్తూ నవంబర్ 20న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తల నుంచి నిరసన వెల్లువెత్తింది. ఈ నిర్వచనం కారణంగా పర్వత శ్రేణులు ఉన్న రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని.. 100 మీటర్ల లోపు ఉన్న పర్వతాల్లో అక్రమ మైనింగ్కు ఆజ్యం పోసినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు శనివారం సుమోటోగా కేసును స్వీకరించింది. సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసితో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. నవంబర్ 20 నాటి తీర్పును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ చేసిన డెఫినిషన్, సిఫార్సులపై మరింత స్టడీ చేయాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నామని.. ఇందు కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు పర్వత శ్రేణులు ఉన్న నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
అధికారుల కమిటీ ఇచ్చిన డెఫినిషన్ కారణంగా.. 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో పర్వతాలు ఉన్న ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్కు అవకాశం ఉందా అనే కోణంలో నిపుణులు స్టడీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
కాగా, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మైనింగ్ జరుగుతున్న చోట రూల్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
దాదాపు 670 కిలో మీటర్ల పొడవునా ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాలో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులు మన దేశంలోనే అత్యంత పురాతనమైనవి. దాదాపు 200 కోట్ల ఏండ్ల చరిత్ర వీటికి ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఆరావళి పర్వత శ్రేణులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
