
వాంటా (ఫిన్లాండ్): ఇండియా స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్కు ఆర్కిటిక్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం జరిగే మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో మ్యాచ్లో లక్ష్య.. ఐదోసీడ్ కొడాయ్ నరోకా (జపాన్)తో తలపడనున్నాడు. హాంకాంగ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన లక్ష్య ఈ సీజన్లో ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాడు. నరోకాపై గెలవాలంటే ఈ మ్యాచ్లో లక్ష్యసేన్ దూకుడు, నియంత్రణ మధ్య సరైన సమతుల్యాన్ని సాధించాల్సి ఉంటుంది. మరో మ్యాచ్లో శ్రీకాంత్.. రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)ను ఎదుర్కోనున్నాడు. ఈ సీజన్ మొత్తంలో నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న శ్రీకాంత్.. టోర్నీలో ముందుకెళ్లాలంటే నెట్ వద్ద నియంత్రణతో కూడిన షాట్లు, మిడ్ కోర్టు పరివర్తన మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.
ఆయుష్ షెట్టి.. కున్లావట్ విటిడ్సర్న్ (థాయ్లాండ్)తో, మన్నేపల్లి తరుణ్.. జూనియర్ పోపోవ్ (ఫ్రాన్స్)తో, కిరణ్ జార్జ్.. కొకి వటానాబే (జపాన్), శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్.. క్రిస్టోవ్ పొపోవ్ (ఫ్రాన్స్)తో తలపడనున్నారు. విమెన్స్ సింగిల్స్లో తన్యా హేమంత్.. హుయాంగ్ చింగ్ పింగ్ (చైనీస్తైపీ)తో, అన్మోల్ ఖర్బ్.. లిన్ సియాంగ్ (చైనీస్తైపీ)తో ఆట మొదలుపెట్టనున్నారు. విమెన్స్ డబుల్స్లో కవిప్రియా సెల్వమ్–సిమ్రన్ సింగ్.. యెంగ్ ఎంగా టింగ్–యెంగ్ పుయి లామ్ (హాంకాంగ్)తో, మిక్స్డ్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో.. లుకాస్ రెనోయిర్–కామిల్లా పోగ్నాటె (ఫ్రాన్స్)తో అమీతుమీ తేల్చుకోనున్నారు.