- ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా
- వెనక్కి తీసుకోవాలంటూ సభలో ప్రతిపక్షాల నిరసన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సంబంధించిన బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. ఇది దేశ సమగ్రతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో బిల్లును సభ్యుల అభిప్రాయం తీసుకునేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఓటింగ్ నిర్వహించగా.. అనుకూలంగా
63 ఓట్లు, వ్యతిరేకంగా 23 ఓట్లు పడ్డాయి.
గవర్నర్ల అధికారాలపై..
గవర్నర్ల అధికారాలు, పాత్రను నిర్వచిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలంటూ సీపీఎం ఎంపీ కె.శివదాసన్ ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు కూడా..
నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ద్వారా జడ్జీల నియామకాలను రెగ్యులేట్ చేసేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ మెంబర్ బిల్లును సీపీఎం ఎంపీ బికాస్ రంజన్ భట్టాచార్య రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలపడంతో ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. అయితే
ఈ బిల్లును ఆప్ వ్యతిరేకించింది.
వ్యాక్సిన్ వేస్ట్ కాలేదు: కేంద్రం
ఎక్స్పైరీ వల్ల కరోనా వ్యాక్సిన్ దేశంలో ఎక్కడా వృథా కాలేదని కేంద్రం లోక్ సభకు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా సభకు వివరించారు. వ్యాక్సిన్ వివరాలపై ఎప్పటికప్పుడు కేంద్రం మానిటర్ చేస్తోందని, ఎక్కువ వినియోగం, తక్కువ వృథా అన్న విధానంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ వినియోగంపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్టు వెల్లడించారు. అలాగే ద కాన్స్టిట్యూషన్(షెడ్యూల్ ట్రైబ్స్) ఆర్డర్(ఫిఫ్త్ అమెండ్మెంట్) బిల్లు, 2022ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఈ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టారు.