
2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో 1,539 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
డ్యూటీలో 9,809 మంది సిబ్బంది 4,557 మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్, వెలుగు: ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల మున్సిపాలిటీలతో పాటు నల్గొండ, గజ్వేల్, పరకాల, బోధన్లలో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తంగా 1,539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,809 మంది సిబ్బందిని ఎన్నికల డ్యూటీ కోసం నియమించామని చెప్పారు. సిబ్బందికి మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్, శానిటైజర్లను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత గెలుపు సంబురాలు, ర్యాలీలను నిషేధిస్తున్నట్టు పార్థసారథి వెల్లడించారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైనా రూల్స్ను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కరోనా భయాలు
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇటు ఎన్నికల సిబ్బందితో పాటు అటు ఓటర్లలోనూ భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 11.34 లక్షల మంది ఓటర్లున్నారు. 2,500 బ్యాలెట్ బాక్సులను వాడుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువగా 878 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అతితక్కువగా కొత్తూర్ మున్సిపాలిటీలో 12 కేంద్రాలను పెట్టారు. ఎన్నికల సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు మాస్కుల చొప్పున 28,810 మాస్కులు, 14,505 ఫేస్ షీల్డ్లు, 22,910 గ్లోవ్స్, 18,455 శానిటైజర్లను అందుబాటులో పెడుతున్నారు. 4,557 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తును నిర్వహించనున్నారు. 336 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఓటర్లు ఆరు అడుగుల దూరంలో ఉంటూ ఓటేసేలా ఏర్పాట్లు చేసినట్టు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ సెక్రటరీ అర్వింద్ కుమార్ తెలిపారు.