ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై ఫైరయ్యారు. అవినీతికి పాల్పడిన వారంతా బీజేపీలో చేరి రక్షణ పొందుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీలో చేరని వారే ఈడీ కేసులలో జైలుకు వెళ్తున్నారని చెప్పారు. మోడీ ఒక రాష్ట్రానికి వెళ్లి ఆ నేతలు వేల కోట్ల అవినీతి చేశారని చెప్తారు.. 4 రోజుల తర్వాత, ఆ నాయకులు బీజేపీలో చేరారు, ఒక నాయకుడు అయితే ఏకంగా సీఎం కూడా అయ్యారు. ఇది అవినీతిపై పోరాటమా? ఇదొక డ్రామా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ నిజంగా పోరాడుతున్నట్లయితే తాను ఎప్పుడో మద్దతిచ్చి ఉండేవాడినని కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ను అరెస్టు చేస్తామని బయట ప్రచారం జరుగుతుంది. మోదీజీ కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారు కానీ.. కేజ్రీవాల్ గొంతును ఎలా నొక్కుతారు.. మోదీజీ నన్ను కాల్చండి.. కేజ్రీవాల్ చనిపోతారు కానీ మీ నిద్రలో కూడా నా గొంతు వినిపిస్తుంది .. భగత్ సింగ్ను ఉరితీసినప్పుడు 100 ఏళ్ల తర్వాత కూడా భగత్ సింగ్ ఆలోచనలు ప్రతి మూలలో ప్రతిధ్వనిస్తున్నాయి అంటూ కేజ్రీవాల్ కామెంట్ చేశారు. తనతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ప్రధానికి మద్దతిస్తామని... కానీ మోదీ తన స్నేహితుడి కోసం పనిచేయడం మానేసి, 140 కోట్ల మంది ప్రజల కోసం పనిచేయడం ప్రారంభించాలన్నారు కేజ్రీవాల్, ఈ దొంగలను రక్షించడం మానేసి జైలుకు పంపలన్నారు.