
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తాజాగా పలు వ్యాఖ్యలు చేశాయి.కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తుందంటూ ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారని, షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయన్నారు.
షుగర్ తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. షుగర్ లెవల్స్ 50ఎంజీ స్థాయికి పడిపోయాయి. ఇది ప్రమాదకర పరిస్థితికి దారి తీసే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వం సీఎం కేజ్రీవాల్ను అనారోగ్యానికి గురిచేస్తూ.. బాధపెట్టేందుకు కుట్ర పన్నుతున్నది. ఆయనను చిత్రహింసలు పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది’ అంటూ ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినప్పుడు 70 కిలోల బరువు ఉన్న ఆయన ప్రస్తుతం 61.5 కిలోలకు తగ్గిపోయారని వాపోయారు.దాదాపు 5 సార్లు కేజ్రీవాల్ షుగర్ లెవల్ 50 ఎంజీ కంటే తక్కువకు వెళ్లిందన్నారు. తరచుగా ఇలా జరిగితే కోమాలోకి వెళ్లే ప్రమాదముందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ | నాలుగేళ్లలో 8కోట్ల ఉద్యోగాలు.. మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే: మల్లికార్జున్ ఖర్గే
ఇదిలా ఉంటే.. ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం ( జులై 12) మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అయితే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడంతో కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు.దీనిపై సంజయ్ సింగ్ స్పందించారు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభిస్తుందేమో అనే అనుమానంతోనే సీబీఐ అక్రమంగా కేసు పెట్టిందంటూ ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ .. కేజ్రీవాల్ జీవితంతో ఆడుకుంటోందంటూ ఘాటుగా విమర్శించారు.