న్యూఢిల్లీ : వడ్డీ రేట్లు పెరగడం వలన ప్రజలు టెర్మ్ సేవింగ్స్ ప్లాన్ల (ఫిక్స్డ్ డిపాజిట్లు వంటివి) వైపు చూడడం పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంక్ డిపాజిట్లలో సేవింగ్స్ స్కీమ్ల ద్వారా వచ్చిన అమౌంట్ కిందటేడాది డిసెంబర్ నాటికి 60.3 శాతానికి పెరిగిందని తెలిపింది. కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ 57.2 శాతం దగ్గర ఉండేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ – డిసెంబర్ మధ్య రూ.లక్ష నుంచి కోటి వరకు ఉన్న టెర్మ్ డిపాజిట్లు భారీగా పెరిగాయని వెల్లడించింది. మరోవైపు కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) డిపాజిట్లు తగ్గాయని తెలిపింది.
అంతేకాకుండా టెర్మ్ డిపాజిట్లలో 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్న డిపాజిట్లు డిసెంబర్, 2023 నాటికి 61.4 శాతం ఉన్నాయని ఆర్బీఐ వివరించింది. కిందటేడాది సెప్టెంబర్ నాటికి ఇది 54.7 శాతంగా, మార్చి నాటికి 33.7 శాతంగా ఉంది. కాగా, కీలకమైన రెపో రేటును 6.5 శాతం దగ్గర ఆర్బీఐ కొనసాగిస్తోంది. దీంతో బ్యాంకులు టెర్మ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ 6–7 శాతం దగ్గర ఉంటోంది.
