
రాజకీయ వేధింపులపై లోక్సభలో ప్రతిపక్షాల నిరసన
కాంగ్రెస్ సహా పలు పార్టీల వాకౌట్.. రాజ్యసభలో 250వ సెషన్
ఎన్సీపీ, బీజేడీపై ప్రధాని మోడీ పొగడ్తలు
బీజేపీ సహా అన్ని పార్టీలు వాళ్లను చూసి నేర్చుకోవాలని సూచన
వింటర్ సెషన్ తొలిరోజే పార్లమెంట్ హీటెక్కింది. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీల ఎంపీలు సోమవారం లోక్సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వాకౌట్ చేశారు. మరోవైపు రాజ్యసభ 250 సెషన్ సందర్భంగా ‘‘దేశ రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర, సంస్కరణల అవసరం” అన్న అంశంపై చర్చలో ప్రధాని మోడీ, మన్మోహన్ మాట్లాడారు.
న్యూఢిల్లీ: వింటర్ సెషన్ తొలిరోజే ప్రతిపక్షాల నిరసనలతో లోక్సభ హీటెక్కింది. ప్రతిపక్ష నేతల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి నెట్టేస్తున్న దని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా పలు పార్టీల ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. కొశ్చన్ అవర్, జీరో అవర్ను అడ్డుకున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన నలుగురు ఎంపీలతో ప్రమాణం చేయించి లోక్సభ స్పీకర్ ఓంబిర్లా బిజినెస్ ప్రారంభించారు. ఈమధ్య చనిపోయిన 10 మాజీ ఎంపీలపై సంతాప తీర్మానాలు చేశారు. ఆ వెంటనే స్పీకర్ క్వొశ్చన్ అవర్ చేపట్టగా, కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీ తదితర పార్టీల ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శివసేన కూడా మహారాష్ట్రలో రైతుల దుస్థితిని కేంద్రం పట్టించుకోవడంలేదంటూ నిరసన వ్యక్తం చేసింది. జీరో అవర్లో కాంగ్రెస్ లోక్సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. కాశ్మీర్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాను పార్లమెంట్కు రానీయకుండా నిర్బంధించడం అట్రాసిటీ కిందికి వస్తుందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్, సోనియా ఫ్యామిలీకి ఎస్పీజీ సెక్యూరిటీ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ, మాజీ ప్రధాని వాజపేయికి చనిపోయేదాకా ఎస్పీజీ సెక్యూరిటీ కొనసాగించిన విషయాన్ని గుర్తుచేశారు. కేసులు, సెక్యూరిటీ తగ్గింపు అంశాల్లో సర్కారు తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
ఎన్సీపీ, బీజేడీని చూసి నేర్చుకోవాలి
రాజ్యసభ 250 సెషన్ సందర్భంగా ‘‘దేశ రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర, సంస్కరణల అవసరం”అన్న అంశంపై సోమవారం జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని మాట్లాడుతూ ఎన్సీపీని పొగిడారు. ‘‘ఇవాళ రెండు పార్టీలను(ఎన్సీపీ, బీజేడీ) మెచ్చుకోవాలని అనుకుంటున్నా. పార్లమెంటరీ రూల్స్కు ఈ రెండుపార్టీలు కట్టుబడి ఉన్నాయి. నిరసనలు తెలపడానికి కోసం వాళ్లెప్పుడూ వెల్లోకి వెళ్లలేదు. అయినప్పటికీ చెప్పదలచుకున్న పాయింట్స్ను వాళ్లు ఎఫెక్టివ్గా చెప్పారు. మాపార్టీతోపాటు అన్ని పార్టీలు వాళ్ల నుంచి నేర్చుకోవాలి’’ అని ప్రధాని అన్నారు. “ఇది శాశ్వతమైందని చెప్పగలను. దేశ ఫెడరల్ స్ట్రక్చర్కు ఈ సభ ప్రాధాన్యం ఇస్తుంది”అని రాజ్యసభ గురించి ప్రధాని చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ… రాష్ట్రాల సరిహద్దుల్ని మార్పులు, చేర్పులు చేసేటప్పుడు రాజ్యసభకు మరింత ఎక్కువ
ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.