ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు

ఉత్తరప్రదేశ్: ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న అసదుద్దీన్.. గురువారం ఓ సభలో మాట్లాడుతూ మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఉపన్యాసం చేశారు. అంతేకాకుండా.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. సభకు భారీగా జనసమూహాన్ని సమీకరించారు. అదేవిధంగా.. సభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. ఆయనపై బారాబంకి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఒవైసీపై కేసు నమోదు చేయబడిందని, మతసామరస్యాన్ని దెబ్బతీయడం, కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మొదలైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని బారాబంకి పోలీస్ సూపరింటెండెంట్ యమునా ప్రసాద్ తెలిపారు.

కాట్ర చందనాలో జరిగిన ఈ సభలో అసదుద్దీన్ కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని.. మాస్క్‌లు ధరించలేదని, కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదని ఎస్పీ అన్నారు. ఒవైసీ తన ప్రసంగంలో 100 సంవత్సరాల నాటి రామ్ సనేహి ఘాట్ మసీదును ధ్వంసం చేశారని.. దాని శిథిలాలు కూడా తొలగించబడ్డాయని కామెంట్‌ చేశారని.. ఇది వాస్తవానికి విరుద్ధమని ఎస్పీ అన్నారు. యూపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అసదుద్దీన్ తమ పార్టీ తరపున 100 సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు.