హైదరాబాద్, వెలుగు: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 15 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వందలాది మంది ఆశా వర్కర్లు సోమవారం కోఠిలోని హెల్త్ డైరెక్టర్ ఆఫీస్ను ముట్టడించారు. గ్రాస్ శాలరీ డిమాండ్తో అప్పటికే డీహెచ్ ఆవరణలో ధర్నా చేస్తున్న ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకు తోడయ్యారు. డైరెక్టర్ ఆఫీస్, ఉమెన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డుపై బైఠాయించి.. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది మంది మహిళలు రోడ్డుపై కూర్చోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరికి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ఆశా వర్కర్లను చర్చలకు పిలిచారు. ఆశాలు, ఏఎన్ఎంల డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందరూ కాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏఎన్ఎంల డిమాండ్లు నెరవేర్చేందుకు ఇప్పటికే కమిటీ వేశారని, ఆశా వర్కర్ల డిమాండ్లపై కూడా కమిటీ వేసి సానుకూల నిర్ణయం తీసుకునేలా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆశా వర్కర్లు సమ్మె విరమణ ప్రకటన చేశారు. తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఏఎన్ఎంలు ప్రకటించారు. రెండ్రోజుల్లో పీఆర్సీ బకాయిలు విడుదల చేయకపోతే, మరోసారి ఆందోళన చేస్తామని ఏఎన్ఎంలు హెచ్చరించారు.
నెలకు రూ.18 వేలు ఇవ్వాలి
డీహెచ్ ఎదుట 18 డిమాండ్స్ను ఉంచామని, ఇందులో రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ప్రధానమైందని ఆశా వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. పీఆర్సీ ఎరియర్స్, రిస్క్ అలవెన్స్ సహా అన్ని డిమాండ్లకూ ఆయన సానుకూలంగా స్పందించారని యూనియన్ ప్రెసిడెంట్ జయలక్ష్మి వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో సమ్మె విరమిస్తున్నామని తెలిపారు.