ఆషాఢం మొదలైంది

ఆషాఢం మొదలైంది

రుతుపవనాలు వచ్చినయ్‌‌. చిరుజల్లులు కురుస్తునయ్‌‌. గోరింటాకు చిగురిస్తోంది. కొత్తగ పెళ్లైన ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోదామా అని ఆలోచిస్తున్నరు. బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఇవన్నీ చూస్తే గుర్తొచ్చింది.. ఆషాఢమాసం వచ్చేసిందని.   తొలకరి జల్లులతో.. పచ్చని కోకను  సింగారించుకున్న ప్రకృతి ఆషాఢమాసానికి స్వాగతం పలికింది. ఈ నెల 10 నుంచి నెల రోజుల పాటు ఆషాఢమాసం. ఈ మాసంలోనే తెలంగాణవ్యాప్తంగా బోనాల పండుగను మస్తు సంబురంగ చేసుకుంటరు. శివసత్తుల పూనకాలు,  పోతరాజుల విన్యాసాలు,  డప్పు చప్పుళ్లు, నృత్యాలతో శ్రావణం దాకా సంబురాలు జరుపుకుంటరు. కొత్త కోడలు ఈ నెలలో అత్తగారింట్ల ఉండకుండా పుట్టింటికి పోవడం సంప్రదాయం. ఆడవాళ్లు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని చూసుకుని మురిసిపోతరు.  
 పండుగలు, బోనాలు
శనివారం నుంచి మొదలైన ఆషాఢం వచ్చేనెల 8 తో ముగుస్తది. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక పండుగలు జరుపుకుంటరు. హైదరాబాద్‌‌లో గోల్కొండ బోనాలు ప్రారంభమైతయ్‌‌. హరిబౌలిలోని అక్కన్న,  మాదన్నల ఆలయంలో బోనాలు తీస్తరు. ఒడిశాలో పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ఆషాఢమాసంలోనే జరుగుతది.  ఈ నెల 20న తొలి ఏకాదశి పండుగతో పండుగలు మొదలైతయ్‌‌. వ్యాస పూర్ణిమ,  సంకట హర చతుర్థి,  చుక్కల అమావాస్య కూడా ఈ నెలలోనే జరుపుకుంటరు. గ్రామాల్లోని ఇళ్లన్నీ బంధువుల రాకతో, ఇంటి పరిసరాలన్నీ  పచ్చని మామిడి తోరణాలతో కళకళలాడుతయ్‌‌.  ఇక గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ఠలు షురూ అయితయ్‌‌.  వర్షాలు బాగా కురవాలని, పంటలు మంచిగ పండి అందరు ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తరు. కొత్తగా పెండ్లైన జంటలను ఆషాఢ మాసంలో ఒకచోట ఉండనియ్యరు. ఆషాఢమాసం పోయి శ్రావణమాసం వచ్చాక  బిడ్డకు సారె పెట్టి సాగనంపుతరు.
                                                                                                                                                                                                   ::: మహాముత్తారం, వెలుగు