న్యూఢిల్లీ: పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదో వారినే అడగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో కొన్ని రోజులుగా ఫ్యుయల్ రేట్లు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఇంధన ధరల మీద ఎక్సైజ్ డ్యూటీని ఇప్పటికే తగ్గించింది.
ఎన్డీయే పాలిత రాష్ట్రాలతోపాటు పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించేది లేదని ఇప్పటికే ప్రకటించాయి. దీనిపై నిర్మలా సీతారామన్ను ప్రశ్నించగా.. ‘వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు?’ అనే ప్రశ్నను ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలనే అడగాలన్నారు. పెట్రోల్, డీజిల్ను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో చేర్చలేమన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో ధరను నిర్ణయించేదాకా పెట్రోల్, డీజిల్ను వస్తు, సేవల పన్నులో చేర్చలేమన్నారు. పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిందని సీతారామన్ చెప్పారు.