సర్కారీ ఉద్యోగులు సినిమా చూసేందుకు హాఫ్ డే లీవ్

సర్కారీ ఉద్యోగులు సినిమా చూసేందుకు హాఫ్ డే లీవ్

గువహటి: కశ్మీర్ ఫైల్స్ సినిమాకు సంబంధించి అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. 1990లో కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసల నేపథ్యంలో కశ్మీర్ ఫైల్స్ సినిమా తెరకెక్కించారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసోం సీఎం హేమంత బిశ్వ కేబినెట్ సహచరులతో కలిసి గువహటిలోని ఓ థియేటర్ లో సినిమా చూశారు. అనంతరం కశ్మీర్ ఫైల్స్ మూవీ చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ హాఫ్ డే లీవ్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సినిమా చూసిన మరుసటి రోజు తమ పై అధికారికి మూవీ టికెట్ చూపించే లీవ్ అప్లై చేసుకోవచ్చని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం ఇప్పటికే తమ రాష్ట్ర పోలీసులు ఈ సినిమా చూసేందుకు స్పెషల్ లీవ్ మంజూరు చేసింది.