ఎలక్షన్ గిరాకీ..ప్రచార సామగ్రికి అభ్యర్థులు ఆర్డర్లు

ఎలక్షన్ గిరాకీ..ప్రచార సామగ్రికి అభ్యర్థులు ఆర్డర్లు
  • ప్రచార సామగ్రికి అభ్యర్థులు ఆర్డర్లు
  • టీ షర్ట్​లు, టోపీలకు  మస్తు డిమాండ్​
  • బిజీగా ప్రింటింగ్ షాప్​ల ఓనర్లు

హైదరాబాద్​, వెలుగు: దసరా తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో  ప్రచార సామగ్రికి డిమాండ్​పెరిగింది. ప్రింటెడ్ ​టీ షర్ట్​లు, కండువాలకు అభ్యర్థులు భారీగానే ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రింటెడ్​ టోపీలు, బ్యాడ్జీలకు కూడా మస్తు గిరాకీ వస్తుంది. ఒక్కో సెగ్మెంట్ నుంచి 2 వేల నుంచి 10 వేల దాకా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో సిటీలోని చిక్కడపల్లిలో ప్రింటింగ్ షాపులు ఎన్నికల పనులతో బిజీగా మారాయి. ప్రతి ఎన్నికల సీజన్​లో ఒక్కో ప్రింటింగ్​షాప్​ యావరేజ్​గా 20 వేల టీ షర్టుల బల్క్​ ఆర్డర్లు ఉంటాయని ప్రింటింగ్​ షాప్​ల ఓనర్లు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు జెండాలు, కండువాలు సిరిసిల్ల నుంచి తెప్పించుకుంటాయి. దేశంలోని ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కువశాతం జెండాలు మాత్రం సిరిసిల్ల నుంచే వెళ్తుంటాయి. 

ఖర్చుకు వెనకాడకుండా.. 

ప్రింటింగ్​ షాప్​లకు కావాల్సిన ముడి వస్తువులను తిరుపతి, చెన్నై, సూరత్​తదితర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటారు. సాధారణంగా ఒక్కో రౌండ్​నెక్​ ప్రింటెడ్ ​పాలిస్టర్​ టీ షర్ట్​కు రూ. 90 దాకా ఉంటుంది. బల్క్​ ఆర్డర్లకు ఒక్కో టీషర్టు రూ. 75  తీసుకుంటారు. ఈ లెక్కన ఒక్కో అభ్యర్థి సగటున 5 వేల టీ షర్ట్​లు ఆర్డర్​ ఇచ్చారనుకుంటే, దాదాపు రూ. 4 లక్షల దాకా వీటిపై ఖర్చు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా పదివేల దాకా టీషర్టులను ప్రింట్ ​చేయించుకుంటున్నట్లు సమాచారం.ప్రింటెడ్ ​కాటన్, కాలర్​ టీ షర్ట్​లకు రూ. 170 దాకా ఉంటుంది. దీంతో అభ్యర్థులు రౌండ్​ నెక్ ​పాలిస్టర్ టీషర్టులకే ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. ​టీషర్టులే కాకుండా.. ప్రింటెడ్​ కండువాలు, టోపీలు, బ్యాడ్జీలు, గొడుగులు, కీ చెయిన్స్, పెన్స్​ ఇతర ప్రచార వస్తువులకు కూడా కొందరు అభ్యర్థులు ఆర్డర్లు ఇస్తున్నారు. 

రెండు, మూడు నెలల ముందే..

ప్రస్తుతం ఎన్నికల రూల్స్, ఖర్చు, లెక్కలు తదితర సమస్యలు ఉంటాయి. దీంతో అభ్యర్థిత్వం ఖరారైన, సీటు​ కన్ఫార్మ్ అనుకున్న కొందరు అభ్యర్థులు రెండు, మూడు నెలల ముందుగానే టీ షర్టులకు బల్క్​ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రింటింగ్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బల్క్​ ఆర్డర్లు తగ్గాయని, నామినేషన్​ ప్రక్రియ మొదలైతే పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. 

నామినేషన్ల తర్వాతే..

ప్రస్తుతం బల్క్​ ఆర్డర్లు తక్కువగానే ఉన్నాయి. నామినేషన్స్​ ప్రక్రియ మొదలైతే పెరుగుతాయి.సిటీలో కంటే రూరల్​ఏరియాల నుంచే ఎక్కువ బల్క్​ ఆర్డర్లు వస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు వేలల్లో ఆర్డర్లు ఇస్తారు. చిన్న పార్టీలు, ఇండిపెండెంట్​ అభ్యర్థులు రెండువేల పీసుల లోపే ఆర్డర్లు ఇస్తున్నారు.

- నందు, నందు ప్రింటర్స్, చిక్కడపల్లి