4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు .. ఏప్రిల్​ 19నుంచి ప్రారంభం

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు .. ఏప్రిల్​ 19నుంచి ప్రారంభం
  • లోక్​సభ ఎన్నికలతోపాటే నిర్వహిస్తామన్న ఈసీ
  • ఫలితాలు జూన్​ 4న వెల్లడి
  • దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్​ స్టేషన్ల ఏర్పాటు
  • సీఈసీ రాజీవ్​ కుమార్​ వివరణ

న్యూఢిల్లీ :  దేశంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ప్రదేశ్​, సిక్కిం, ఒడిసా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఏప్రిల్​ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్​ 1 వరకు ఏడు దశల్లో ఎలక్షన్స్​ జరుగనున్నాయి. జూన్​ 4న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.  సార్వత్రిక ఎన్నికలతోపాటే వీటిని కూడా నిర్వహించనున్నట్టు చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ శనివారం వెల్లడించారు.  దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకునేందుకు 10.5 లక్షల పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్​: ఆంధ్రప్రదేశ్​లో 175 అసెంబ్లీ స్థానాలుండగా 2019లో వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పార్టీ 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. మొత్తం 49.5 శాతం ఓట్లు​సాధించింది. 23 సీట్లతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకొన్నది. 2024 ఎన్నికల్లో టీడీపీ పవన్​ కల్యాణ్​ నేతృత్వంలోని జనసేన పార్టీతో కలిసి ఆరేండ్ల తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరింది. .

సిక్కిం : సిక్కింలో 2019లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్​కేఎం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 32 అసెంబ్లీ స్థానాలకుగానూ 17 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. 15 సీట్లతో సిక్కిం డెమొక్రటిక్​ఫ్రంట్​ (ఎస్డీఎఫ్​) ప్రతిపక్ష స్థానాన్ని పొందింది. 

 అరుణాచల్​ ప్రదేశ్​: అరుణాచల్​ ప్రదేశ్​లో 2019లో బీజేపీ అధికారాన్ని దక్కించుకొన్నది. 60 అసెంబ్లీ సీట్లకుగానూ ఆ పార్టీ 41 స్థానాల్లో విజయం సాధించింది. జనతా దళ్​ (యునైటెడ్​) 7, నేషనల్​ పీపుల్స్​ పార్టీ (ఎన్​పీపీ) 5, కాంగ్రెస్​ 4, పీపుల్స్​ పార్టీ ఆఫ్​ అరుణాచల్​ ప్రదేశ్​ 1 సీటు గెలుచుకొన్నాయి. కాగా, 2024  అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బుధవారం 60 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 

ఒడిసా : 2019 ఎన్నికల్లో నవీన్​ పట్నాయక్​ నేతృత్వంలోని బిజు జనతాదల్​ (బీజేడీ) పార్టీ 147 అసెంబ్లీ సీట్లకుగానూ 112 గెలుచుకొని అధికారం దక్కించుకొన్నది. నవీన్​ పట్నాయక్​ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. దేశంలోనే ఓ రాష్ట్రానికి అత్యధిక సార్లు సీఎంగా పనిచేసిన పవన్​ చామ్లింగ్​ (సిక్కిం), జ్యోతి బసు (బెంగాల్​) రికార్డును సమం చేశారు. కాగా, ఎన్నికల్​ షెడ్యూల్​ వచ్చినా బీజేపీ, బీజేడీ పొత్తుపై సందిగ్ధం వీడలేదు.