హైదరాబాద్ : తల్లిదండ్రులను వదిలేయడం తీవ్రమైన నేరమని… అందుకు మూడునెలల జైలు శిక్ష, జరిమానా ఉంటుందని తెలిపారు సీనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కె.మురళీమోహన్. సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి కె. మురళీమోహన్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ పోషణ, సంక్షేమ చట్టం గురించి వివరించారు.
తల్లిదండ్రులను, సీనియర్ సిటిజన్స్ను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలపై, వారి వారసులపైనే ఉంటుందన్నారు. నిరాదరణకు గురవుతున్న పెద్దలు, తమ పోషణ కోసం ఆర్డీఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ను సంప్రదించవచ్చని చెప్పారు. మాయమాటలతో మోసాలకు పాల్పడి… తల్లిదండ్రుల ఆస్తిని కాజేసి… వారిని చూసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే తల్లిదండ్రులు.. తమ ఆస్తిని తిరిగి వెనక్కి పొందే అవకాశాన్ని చట్టం కల్పిస్తుందని తెలిపారు మురళీమోహన్. ప్రస్తుత రోజుల్లో కొందరు కొడుకులు ఆస్తిని పంచుకుని తల్లిదండ్రలను లెక్క చేయడంలేదన్నారు. తల్లిదండ్రులు కూడా తమ భార్యాపిల్లల్లో భాగంగా ప్రతి కొడుకు గుర్తించాలని సూచించారు. అలాగే బతికుండగానే ఎట్టిపరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని పంచకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చారు.