
83 ఏండ్ల వయస్సులో పసిఫిక్ మహా సముద్రంలో ఒంటరిగా ప్రయాణం చేసి జపాన్ కు చెందిన ఓ వ్యక్తి రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు.
టోక్యో : జపాన్ నావికుడు కెనిచి హోరై చరిత్ర సృష్టించాడు. 83 ఏళ్ల వయసులో పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా దాటేశాడు. మార్చి 27వ తేదీన కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి పడవలో ప్రయాణం ప్రారంభించాడు. రెండు నెలల పాటు పసిఫిక్ సముద్రంలో ప్రయాణించిన కెనిచి హూరై.. జపాన్లోని షికోకు దీవులకు చేరాడు. 990 కిలోల బరువు ఉన్న సన్టోరీ మెరమెయిడ్ బోటులో ఆయన ప్రయాణం సాగింది. బోటు ప్రయాణ సమయంలో తన వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్తో ప్రతి రోజు తన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడేవాడు.
చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే కెనిచి హూరైకి చాలా ఇష్టం. పసిఫిక్ మహాసముద్రాన్ని దాటడం కెనిచికి ఇది మొదటిసారి కాదు. 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి కాలిఫోర్నియాకు ఒంటరిగా బోటుపై వెళ్లాడు. అయితే ఆ సమయంలో పాస్పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. మళ్లీ ఇప్పుడు కెనిచి హోరై మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం (జూన్ 4న) తెల్లవారుజామున జపాన్లోని కియ్ జలసంధికి చేరుకున్నారు.
ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా కెనిచి నిలిచాడు. వందేళ్లు వచ్చే వరకు కూడా ఇలాంటి ప్రయాణాలు చేయాలని కెనిచి నిశ్చయించుకున్నాడు. భూమిపై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టి రావడం మామూలు విషయం కాదంటూ నెటిజన్లు కెనిచిని అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని వార్తల కోసం..