కులం పేరుతో దూషించిన బీఆర్ఎస్ నాయకుడిపై అట్రాసిటీ కేసు

కులం పేరుతో దూషించిన బీఆర్ఎస్ నాయకుడిపై అట్రాసిటీ కేసు

కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన అధికార బీఆర్​ఎస్​ నాయకుడు తాత మనోజ్​పై మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మండలంలోని దమ్మాయిగూడెం గ్రామంలోని ఎవర్ సేస్ స్కూల్ బస్ క్లీనర్​గా పగిడిపల్లి బాబు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. పొద్దున  స్కూల్ బస్సులో పిండిప్రోలు గ్రామంలో చదువుతున్న స్టూడెంట్లను ఎక్కించుకొని వెళ్తుండగా గ్రామంలో ఓ చోట రివర్స్ తీయాల్సి వచ్చింది. క్లీనర్ బాబు దిగి డ్రైవర్​కు సూచనలు చేస్తుండగా, తాత మనోజ్​కు చెందిన ట్రాక్టర్ బస్సుకు అడ్డు రావడంతో కొంచెం వెనకకు జరపాలని కోరాడు. 

దీంతో తాత మనోజ్  బస్సు క్లీనర్​ బాబును కులం పేరుతో దూషిస్తూ తమతో మాట్లాడే దమ్ము ఉందా? అని తన్ని,  దాడి చేశాడు. మనోజ్​ దాడిని ఖండిస్తూ పిండిప్రోలు గ్రామంలో ఖమ్మం – వరంగల్ హైవే పై దళితులు రాస్తారోకో నిర్వహించారు. మనోజ్​ను వెంటనే అరెస్టు చేయాలని నినదించారు.  దళిత సంఘం నాయకులు వీరభద్రం, యూనిట్​ ఆఫ్​ మాల, కేవీపీఎస్ నాయకులతో కలిసి క్లీనర్​ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాతా మనోజ్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు 
నమోదు చేసినట్లు ఎస్ఐ వరాల శ్రీనివాస్​రావు పేర్కొన్నారు.