- పదేండ్ల పాలనలో దగాపడ్డ దళితులు..
- వారికి జరిగింది మేడిపండు న్యాయమే: జస్టిస్చంద్రకుమార్
- సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుక్లెట్ విడుదల
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల కేసీఆర్ పాలనలో దళితులకు జరిగింది మేడిపండులాంటి న్యాయమేనని, దళిత సీఎం నుంచి దళితబంధు వరకు అన్ని బూటకపు హామీలేనని పలువురు వక్తలు మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ‘చాటింపు’ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో ‘పదేళ్ల కేసీఆర్ పాలనలో దగాపడ్డ దళితులు’ అనే విమర్శనాత్మక బుక్లెట్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి తదితరులు బుక్లెట్రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్తీసుకొచ్చిన దళితబంధు పథకం అందని ద్రాక్ష అని, 40 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం చేరడానికి130 ఏండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.
రూ. 84 వేల కోట్లు దళితులకు బాకీ
రిటైర్డ్ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. కేసీ ఆర్దళితుల కోసం తీసుకొచ్చిన పథకాలను ‘ఆహ నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాస రావు కోడికూర కామెడీ సీన్తో పోల్చారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, దళిత బంధు లాంటి హామీలు, పథకాలను చూసి మురవటమే తప్ప, పూర్తిస్థాయి అమలుకు నోచుకోవని ఎద్దేవా చేశారు. క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన నిధులను దారి మళ్లించడం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, కేసీఆర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు.
దాదాపు రూ.84 వేల కోట్లు కేసీఆర్ దళితులకు బాకీ పడ్డారని తెలిపారు. గ్రామ స్థాయిలో దళిత, గిరిజన సర్పంచ్లను తొక్కెయడానికే వీడీసీ వ్యవస్థను తీసుకొచ్చారని పలువురు వక్తలు మండిపడ్డారు. పదేండ్లలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, ఇప్పటికీ నేరెళ్ల, మంథని మధుకర్లాంటి కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దళిత ప్రజాప్రతినిధుల విషయంలో కేసీఆర్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బుక్లెట్ ప్రచురణకర్తలు వినాయక్ రెడ్డి, యాదగిరాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు ప్రసాద్, తెలంగాణ జల సాధన సమితి నేత గోవర్ధన్, సీపీఐ రాష్ట్ర నాయకులు సుధాకర్, లచ్చయ్య పాల్గొన్నారు.