
లోకేశ్వరం, వెలుగు: బంధువు మంత్రాలు చేయడంతోనే తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని అనుమానిస్తూ వృద్ధుడిని కొట్టి చంపిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన గడ్డం పోసులు(64), గడ్డం గంగాధర్, గడ్డం సాయిలు అన్నదమ్ముల కొడుకులు అవుతారు. తమ కుటుంబసభ్యులకు పోసులు మంత్రాలు చేయడంతోనే అనార్యోగానికి గురవుతున్నారని గంగాధర్, సాయిలు అనుమానించి కక్ష గట్టారు.
గురువారం ఉదయం చేనులో పత్తిగింజలు పెట్టడానికి వెళ్తుండగా పోసులును బస్టాండ్ సమీపంలో గంగాధర్, సాయిలు అడ్డుకొని వాగ్వాదానికి దిగి నెట్టివేయడంతో పక్కనే ఉన్న డ్రైనేజీ పై పడిపోయాడు. గంగాధర్ బండరాయి తీసుకుని అతడి తలపై తీవ్రంగా కొట్టడంతో పోసులు స్పాట్ లో చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ అశోక్ కుమార్ వెళ్లగా.. అప్పటికే నిందితులు పారిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.