
ఖానాపూర్, వెలుగు: భర్త, అత్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకా రం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన శైలజ(20)తో, అదే గ్రామానికి చెందిన అల్లేపు రాజేశ్కు మూడు నెలల కింద పెళ్లి జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి శైలజను ఆమె భర్త రాజేశ్, అత్త లక్ష్మి అదనపు వరకట్నం తేవాలని వేధించేవారు.
కట్నం తేకపోతే తల్లి వద్దకు వెళ్లిపొమ్మని చెబుతుండేవారు. ఈ విషయాన్ని పలుమార్లు శైలజ తన తల్లి నర్సవ్వకు తెలిపింది. ఈ క్రమంలో వేధింపులు తీవ్రం కావడంతో శనివారం ఉరి వేసుకొని చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని నిర్మల్ అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా, ఇన్ చార్జి సీఐ గోవర్ధన్ పరిశీలించారు. మృతురాలి తల్లి నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.