పెద్దనాయనను  నరికి చంపిండు.. తల, మొండెం వేరుచేసి  సెల్ఫీ వీడియో

పెద్దనాయనను  నరికి చంపిండు.. తల, మొండెం వేరుచేసి  సెల్ఫీ వీడియో
  •     భూ తగాదాలతో బాధితుడి తమ్ముని కొడుకు ఘాతుకం
  •     అనంతరం పోలీస్ స్టేషన్​లో లొంగుబాటు
  •     సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి/ఝరాసంఘం, వెలుగు : భూ తగాదాల కారణంగా పెద్దనాయనను తమ్ముని కొడుకు హత్య చేశాడు. తల్వార్ తో నరికి తల, మొండెం వేరుచేశాడు. అనంతరం ఊరి నడిబొడ్డున సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం బ‌ర్దిపూర్‌  గ్రామంలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బర్దిపూర్ గ్రామానికి చెందిన బండమీది చంద్రన్న (60) కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు. వారిలో చంద్రన్న రెండో వ్యక్తి. పెద్దల నుంచి సంక్రమించిన ఉమ్మడి ఆస్తిని కొన్ని సంవత్సరాల క్రితమే పంపకాలు చేసుకొన్నారు. పంపకాల టైంలో భూమి హెచ్చుతగ్గులుగా పంచుకున్నారు.

ప్రస్తుత మార్కెట్లో భూమి విలువ పెరగడంతో అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భూ పంపకంలో వచ్చిన తేడాలను సరిచేసుకోవాలన్న విషయం కాస్త కేసుల వరకు వెళ్లింది. ఈ క్రమంలో చంద్రన్న తమ్ముడు రత్నం కొడుకు రాకేశ్  తన పెద్దనాయనపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల టైంలో చంద్రన్న చేను వద్ద ఉన్నాడని తెలుసుకొని రాకేశ్  అక్కడికి వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న తల్వార్ తో పెద్దనాయనను హత్య చేసి తల, మొండెం వేరుచేశాడు. అనంతరం తల, తల్వార్​ను ఆటోలో వేసుకుని బర్దిపూర్ గ్రామానికి వెళ్లాడు.  ఊరి మధ్యలో ఉన్న బసవేశ్వర విగ్రహం వద్ద నిలబడి ఫేస్ బుక్  లైవ్ లో మాట్లాడుతూ తమ కుటుంబంలో కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నాయని నిందితుడు చెప్పాడు.

పెద్దలు, పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, పొలిటికల్  లీడర్లు కూడా అన్యాయం చేశారని ఆరోపించాడు. తర్వాత అదే ఆటోలో బయలుదేరి రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో డీజిల్ పోసుకుంటుండగా ఆటోలో తల, తల్వార్ ను చూసిన బంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో  చంద్రన్న తలను పక్కనే ఉన్న గుంతలో పారేసి నేరుగా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన పెద్దనాయనను తానే హత్య చేశానని, భూ వివాదమే అందుకు కారణమని ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చంద్రన్న డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.