- దళితబంధు ఎంపికపై ఫిర్యాదు చేయబోయిన మహిళ
- కడుపులో తన్నిన సర్పంచ్
- మరో నలుగురిపైనా చేయి చేసుకుండు
- నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(కే) గ్రామంలో ఘటన
భైంసా, వెలుగు: ఎమ్మెల్యే ఎదుటే దళితులపై దాడి చేశాడు బీఆర్ఎస్ సర్పంచ్. మహిళ కడుపులో తన్నాడు. మరో నలుగురిపై చేయిచేసుకున్నాడు. నిర్మల్జిల్లా బాసర మండలం కిర్గుల్(కే) గ్రామంలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. కిర్గుల్(కే) గ్రామానికి ఐదు దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి. ఈ యూనిట్లను సర్పంచ్ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ఇచ్చారు. దీనిపై గ్రామంలోని 25 దళిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
గ్రామంలో కొత్తగా కట్టబోయే శ్రీరామ మందిరానికి భూమి పూజ చేసేందుకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాగా.. దళితులు ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న సర్పంచ్ దేవేందర్.. ఎమ్మెల్యే ముందే వారితో గొడవకు దిగాడు. జ్యోతి అనే మహిళ కడుపులో తన్నడంతో ఆమె కిందపడగా గాయాలయ్యాయి. మరో నలుగురిపైనా సర్పంచ్ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన వారిని స్థానికులు భైంసా ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఐదు కుటుంబాలు ఓట్లు వేస్తేనే మీరు గెలువలేదని, అందరూ వేస్తేనే గెలిచారని దళితులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని నిలదీశారు.