అదే ఆఖరి మ్యాచ్.. రిటైర్మెంట్‌పై డేవిడ్ వార్నర్ కీలక ప్రకటన

అదే ఆఖరి మ్యాచ్.. రిటైర్మెంట్‌పై డేవిడ్ వార్నర్ కీలక ప్రకటన

ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరగబోయే టెస్టు మ్యాచ్, తన కెరీర్‌లో ఆఖరి టెస్టు కావచ్చన్న వార్నర్.. 2024 టీ20 వరల్డ్ కప్‌ అనంతరం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు.

టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవవడంపై వార్నర్ స్పందిస్తూ.. "ప్రస్తుతం నా దృష్టంతా డబ్ల్యూటీసీ ఫైనల్‌ వైపే ఉంది. అది ముగిశాక యాషెస్ సిరీస్‌. ఈ రెండింటిలో పరుగులు చేయగలిగితే ఖచ్చితంగా వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడతాను. ఒకవేళ ఈ రెండింటిలో విఫలమైతే అక్కడ దాకా ఉంటానో కూడా లేదో కూడా చెప్పలేను..' అని తెలిపాడు. 

ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌పై స్పందించిన వార్నర్..'ప్రస్తుతానికైతే నేను బాగానే పరుగులు చేస్తున్నా.. అది ఇక ముందు కూడా జరుగుతుందని చెప్పలేను. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ తో నా ఫైనల్ మ్యాచ్ ముగుస్తుందని ముందుగానే చెప్పగలను. ఈ విషయంలో నా కుటుంబానికి కూడా మాటిచ్చాను..' అంటూ వార్నర్ తన రిటైర్మెంట్‌పై ప్రకటన చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.