- మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో ప్రధాని మోదీ భేటీ
- ఆర్థిక, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారానికి అంగీకారం
- టెర్రరిజంపై కలిసి పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా గురువారం పలు చరిత్రాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వమే ధ్యేయంగా ఈ రెండు దేశాలు తమ ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో గురువారం జరిపిన ద్వైపాక్షిక శిఖరాగ్ర చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా సివిల్న్యూక్లియర్ఎనర్జీ, సముద్ర తీర భద్రత, రక్షణ, కీలక ఖనిజాల సరఫరాతో సహా వివిధ రంగాలకు సంబంధించి ఇరు దేశాలు18 చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
భారతదేశంలో నడుస్తున్న అణు విద్యుత్ ప్రాజెక్టుల అవసరాల కోసం ఆస్ట్రేలియా నుండి వాణిజ్యపరంగా యురేనియం సరఫరా చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే, ఇండో, -పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాయి.
ఇరు దేశాల రక్షణ దళాల మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడిని పెంచేందుకు ‘మారీటైమ్ సెక్యూరిటీ కొల్లాబరేషన్ రోడ్మ్యాప్’ను ప్రకటించాయి. భారత కోస్ట్ గార్డ్ (ఐసీజీ), ఆస్ట్రేలియా మారీటైమ్ బోర్డర్ కమాండ్ (ఎంబీసీ) మధ్య సరిహద్దు రక్షణ, సముద్ర చట్టాల అమలు కోసం ఒప్పందం కుదిరింది. నౌకల నిర్మాణం, మరమ్మతులు, రక్షణ రంగ స్టార్టప్లను అనుసంధానించడానికి 'ఇండియా, -ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇన్నోవేషన్ కారిడార్' ను ఏర్పాటు చేయనున్నారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని (సీఈసీఏ), ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేయాలని ఇరు దేశాల ప్రధానులు నిర్ణయించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు భారత్ అత్యున్నత స్థాయి భద్రతా భాగస్వామి అని, రెండు దేశాల మధ్య బంధం గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా, వ్యూహాత్మకంగా మారిందని కొనియాడారు.
- ఆస్ట్రేలియా వ్యాపారాలకు ఇండియా గమ్యస్థానం
ఆస్ట్రేలియా వ్యాపార సంస్థలకు భారతదేశం ఒక దీర్ఘకాలిక పెట్టుబడి గమ్యస్థానమని ప్రధాని మోదీ సూచించారు. భారతదేశ పరిమాణం, ఆస్ట్రేలియా నైపుణ్యం కలిసి ‘పరస్పర ప్రయోజనకర ప్రతిపాదన’ను అందిస్తాయని పేర్కొన్నారు.
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ)ను వేగంగా ముగించాలని ఆయన కోరారు. గురువారం మెల్బోర్న్ లో 200 మందికి పైగా సీఈఓలు, బిజినెస్లీడర్స్ హాజరైన ‘ఆస్ట్రేలియా, -ఇండియా సీఈఓస్ ఫోరం ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్’లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి మోదీ ప్రసంగించారు. భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి, పాలసీ రిఫార్మ్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎక్స్పాండింగ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఆస్ట్రేలియా కంపెనీలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని అన్నారు.
టెర్రర్ క్యాంపుల్లో పేలుళ్ల శబ్దం ప్రపంచమంతా ప్రతిధ్వనించింది..
భారతదేశ సరిహద్దు అవతల ఉగ్రవాద శిబిరాల్లో పేలుళ్ల శబ్ధం ప్రపంచమంతా ప్రతిధ్వనించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ సమయంలో ప్రపంచమంతా భారతదేశ సంకల్పాన్ని చూసిందని పేర్కొన్నారు. గురువారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులతో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ప్రస్తావించారు. ‘ఆపరేషన్ సిందూర్.. భారతదేశ సైనిక బలాన్ని, ప్రపంచ రక్షణ విశ్వసనీయతను ప్రదర్శించింది”అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత్కు 3 కళాఖండాలు
తమిళనాడుకు చెందిన మూడు ప్రాచీన కళాఖండాలను భారత్కు తిరిగి అప్పగించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. వీటిలో 11-వ శతాబ్దానికి చెందిన నంది రాతి విగ్రహం, భద్రకాళి ప్రతిమతో కూడిన లోహ త్రిశూలం, 12వ శతాబ్దానికి చెందిన షణ్ముఖ కార్తికేయుడి రాతి విగ్రహం ఉన్నాయి. వీటిని త్వరలోనే భారత్కు తరలించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ కళాఖండాలు ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ లో ఉన్నాయి. ఇక చెన్నై మ్యూజియంలో ఉన్న ఆస్ట్రేలియా ఫస్ట్ నేషన్స్కు చెందిన ఓ పూర్వీకుడి అవశేషాలను భారత్ తిరిగి ఆ దేశానికి అప్పగించేందుకు అంగీకరించింది.
