షోరూముల్లో వాహనాల నిల్వలు అలాగే ఉంటున్నాయి. వాటిని కొనే దిక్కులేదు. కొందామనుకున్న వారికి అప్పు పుట్టదు. ఖర్చుల భారం పెరిగింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికీ ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. అప్పుల కిస్తీలు కట్టడానికి చేతులు తడుముకోకతప్పదు. కొత్తగా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకురావడం లేదు. భవిష్యత్ బాగుంటుందనే ఆశలు లేవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ షోరూమ్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్ని ఇవి! ఒకటో రెండో నగరాల్లో కాదు దేశవ్యాప్తంగా డీలర్లు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గత ఎనిమిది నెలలుగా వాహనాల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు 250లకుపైగా షోరూమ్లు మూతపడ్డాయి. రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమ్మకాలు లేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. కొన్ని అయితే తాత్కాలికంగా ప్లాంట్లను మూసేశాయి కూడా. మరో విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా కంపెనీలు డీలర్ల మార్జిన్ను పెంచడం లేదు. అందుకే విక్రేతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా డీలర్లకు దాదాపు రూ.40 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వీరిలో చాలా మంది దివాలాకు దగ్గరగా ఉన్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయడు మిలింద్ దేవ్రా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు డీలర్లకు నష్టం చేస్తున్నాయని విమర్శించారు. కొత్త అప్పులు పుట్టక, ఉన్న అప్పులు తీర్చలేక సతమతమవుతున్నామని డీలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కొత్త వాహనాలకు డిమాండ్ చాలా తక్కువ ఉంటుందని లక్నోలోని యునైటెడ్ ఆటోమొబైల్స్ యజమాని వింకేశ్ గులాటీ అన్నారు. డీలర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడమూ అమ్మకాలపై ప్రభావం చూపుతోందని చెప్పారు. ప్యాసింజర్ వెహికిల్స్, హెవీ కమర్షియల్ వెహికిల్ కంపెనీలు కూడా కస్టమర్లకు రాయితీలు, క్యాష్బ్యాక్లు ఇవ్వడం తగ్గించాయని అన్నారు.
సారీ.. అప్పులు ఇవ్వలేం
ఆటోరంగం ఇప్పుడప్పుడే కోలుకునే సంకేతాలు లేవు కాబట్టి బ్యాంకులు దీనిని దూరం పెడుతున్నాయి. ఆటోడీలర్లకు అప్పులు ఇవ్వడాన్ని తగ్గించుకోవాలని స్టేట్ బ్యాంక్ నిర్ణయించుకుంది. వీరికి అప్పులు ఇచ్చేందుకు రూల్స్ను కఠినంగా మార్చింది. మనదేశంలోనే అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ‘ఐఎల్ఎఫ్ఎస్’ గత ఏడాది దివాలా తీసిన తరువాత మిగతా ఎన్బీఎఫ్సీలకు కంపెనీలకు లిక్విడిటీ దొరకడం కష్టంగా మారింది. దీంతో వెహికిల్ ఫైనాన్స్ సంస్థలు వడ్డీరేట్లను పెంచాయి. ఫలితంగా వాహన అమ్మకాలూ తగ్గాయి. ఎన్బీఎఫ్సీల నుంచి ఎక్కువగా అప్పులు తీసుకునే డీలర్లు, కంపెనీలు వాటిలో సంక్షోభం ఏర్పడ్డాక బ్యాంకులపై ఆధారపడటం మొదలుపెట్టాయి. అయితే ఆటోరంగం గత ఎనిమిది నెలల నుంచి నేలచూపులు చూస్తుండటంతో బ్యాంకులు వీటిని దగ్గరికి రానివ్వడం లేదు. కార్ల వ్యాపారంలో ఒడిదుడుకులు పెరిగినందున లోన్ల రూల్స్ను కఠినతరం చేసినట్టు ఎస్బీఐ హ్యుండై మోటార్స్ డీలర్లకు స్పష్టం చేసినట్టు తెలిసింది. డీలర్లు లోన్ మొత్తంలో 25 శాతం కొల్లటేరల్ చూపించకుంటే లోన్ ఇవ్వలేమని కూడా స్పష్టం చేసింది. ఇండియాలోని రెండోఅతిపెద్ద కార్ల కంపెనీ డీలర్లకే అప్పు పుట్టకుంటే మిగతా కంపెనీల డీలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎస్బీఐ మాదిరే మిగతా బ్యాంకులు కూడా లోన్రూల్స్ను కఠినతరం చేశాయి. డీలర్లకు ఇప్పటికే చాలా అప్పులు ఇచ్చామని, ఇక నుంచి ఇవ్వడం కుదరదని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఆటో రిటైల్ మార్కెట్కు ఈ బ్యాంకు దాదాపు రూ.ఏడు వేల కోట్ల వరకు అప్పులు ఇచ్చింది. డీలర్ల ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి షోరూముల్లోని స్టాక్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.
ఇవీ డీలర్ల సమస్యలు
…దేశవ్యాప్తంగా గత కొన్ని నెలల్లో వందలాది షోరూమ్లు మూతపడ్డాయి. డీలర్ల అప్పులు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరాయి.
…వాహన తయారీ కంపెనీలు గత కొన్నేళ్లుగా డీలర్లకు మార్జిన్లు పెంచలేదు. డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు ఇవ్వడాన్ని తగ్గించాయి.
… వరుసగా ఎనిమిది నెలల నుంచి అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. వర్షాకాలంలో అమ్మకాలు చాలా తక్కువగా నమోదవుతాయి.
…. ఒకే వీధిలో రెండు మూడు వాహనాల షోరూమ్లు రావడంతో, డీలర్ల మధ్య పోటీ బాగా పెరిగింది. అమ్మకాలు తగ్గాయి.
….ఇప్పట్లో ఆటోరంగం కోలుకునే అవకాశం లేదనే అంచనాతో బ్యాంకులు డీలర్లను దూరం పెడుతున్నాయి. అప్పులు ఇచ్చినా, భారీగా కొల్లటేరల్ అడుగుతున్నాయి.
