
న్యూఢిల్లీ : ఆటోమొబైల్ పరిశ్రమ ప్యాసింజర్ వెహికల్స్(పీవీ) ఎగుమతి వాటాను 2030 నాటికి ఇప్పుడున్న 14 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కోరారు. మన దగ్గర లేబర్ చవకగా దొరుకుతారని, నిపుణులకూ కొరత లేదు కాబట్టి ఈ టార్గెట్ను సాధించడం సులభమేనని అన్నారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు.
ఆటో పరిశ్రమ 25శాతం ఎగుమతి వాటాను సాధించడానికి పరిమితం కాకూడదని, కనీసం 50శాతం ఎగుమతి వాటాను లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. ‘‘వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకు 50కి పైగా దేశాల నుంచి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు వస్తారు. అత్యాధునిక టెక్నాలజీలను ప్రదర్శిస్తారు. 27 కంటే ఎక్కువ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్ను, ఎలక్ట్రిక్ వెహికల్స్ను లాంచ్ చేస్తాయి.
అని కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈవెంట్లో 400కి పైగా ఆటో కాంపోనెంట్ తయారీదారులు పాల్గొంటారు. 13 గ్లోబల్ మార్కెట్ల నుంచి వెయ్యికిపైగా బ్రాండ్లు వాటి ప్రొడక్టులను, టెక్నాలజీలను, సర్వీసులను ప్రదర్శిస్తాయి. పదికిపైగా కంపెనీలు ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ మార్పిడి పరిష్కారాలు, మౌలిక సదుపాయాల సేవలను కూడా ప్రదర్శిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.