ఆటో అమ్మకాల రికార్డు.. 2026లో సేల్స్ 13 శాతం జంప్.. 2.96 కోట్ల యూనిట్ల అమ్మకం

ఆటో అమ్మకాల రికార్డు.. 2026లో సేల్స్ 13 శాతం జంప్.. 2.96 కోట్ల యూనిట్ల అమ్మకం
  • జీఎస్టీ తగ్గింపుతో మేలు
  • వెల్లడించిన ఫాడా రిపోర్ట్​

న్యూఢిల్లీ: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటో మొబైల్ రంగం అద్భుత పనితీరు కనబరిచింది. వెహికల్స్​ రిటైల్ విక్రయాలు 13.3 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 2,96,71,064 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది 2,61,87,255 యూనిట్లు అమ్ముడయ్యాయి.  జీఎస్​టీ 2.0 అమలుతో మార్కెట్ పుంజుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం ఈ వివరాలు వెల్లడించింది. దాదాపు 3 కోట్ల అమ్మకాలు నమోదు కావడం పరిశ్రమ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొంది.

  • వివిధ విభాగాల పనితీరు

ప్యాసింజర్ వెహికల్స్​ (పీవీ) అమ్మకాలు 13 శాతం వృద్ధి చెందాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో 47,05,056 పీవీలు అమ్ముడవగా.. అంతకుముందు ఏడాది 41,63,927  యూనిట్లు సేల్​ అయ్యాయి. టూవీలర్స్​ అమ్మకాలు 13.4 శాతం పెరిగి 2,14,20,386 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్స్​ విక్రయాలు 11.68 శాతం వృద్ధితో 13,63,412 యూనిట్లుగా నమోదయ్యాయి. 

కమర్షియల్ వెహికల్స్​ (సీవీ) 11.74 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 10,60,906 యూనిట్లుగా ఉన్నాయి. ఆరు వాహన విభాగాల్లో ఐదు రికార్డు స్థాయి అమ్మకాలు సాధించడం విశేషం. జీఎస్​టీ తగ్గింపు వల్ల పన్ను భారం తగ్గి సామాన్యులకు వెహికల్స్​ అందుబాటులోకి వచ్చాయని, అమ్మకాలు పెరిగాయని ఫాడా తెలిపింది.

  • ముందున్నయ్​ సవాళ్లు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఆటో రంగానికి ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల ఇంధన ధరలు పెరగడం, వెహికల్స్​ సరఫరాలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని ఫాడా పేర్కొంది. సుమారు 53.2 శాతం డీలర్లు వెహికల్స్​ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం వల్ల విడిభాగాల రాక ఆలస్యమవుతోంది. ఇంధన ధరల భయం వినియోగదారులను సీఎన్​జీ, ఈవీ వెహికల్స్​ వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం వెహికల్స్​లోన్ల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు పరిణామాలను నిశితంగా గమనించాల్సి ఉందని ఫాడా తెలిపింది.