ఆటోమొబైల్ ఎగుమతులు 28% డౌన్​

ఆటోమొబైల్ ఎగుమతులు 28%  డౌన్​
  • ఆటోమొబైల్ ఎగుమతులు 28%  డౌన్​
  • కొన్ని దేశాల ఫైనాన్షియల్​ మార్కెట్లలో ఇబ్బందులు
  • కరెన్సీ విలువ తగ్గుదల

న్యూఢిల్లీ : ఆఫ్రికాతోపాటు  ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఫైనాన్షియల్​ మార్కెట్లు దెబ్బతినడంతో ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ కాలంలో మనదేశం నుంచి ఆటోమొబైల్ ఎగుమతులు 28 శాతం తగ్గాయి.  సియామ్ లెక్కల ప్రకారం..  జూన్ 30, 2023తో ముగిసిన మొదటి క్వార్టర్​లో మొత్తం ఎగుమతులు 10,32,449 యూనిట్లు కాగా, గత ఏడాది ఇదే కాలంలో 14,25,967 యూనిట్లుగా రికార్డయ్యాయి. మొదటి క్వార్టర్​లో అన్ని వెహికల్స్ విభాగాల ఎగుమతుల్లో తగ్గుదల కనిపించింది. ఆఫ్రికాతోపాటు  ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్​) డీజీ రాజేష్ మీనన్ చెప్పారు. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్యం సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అందుకే వెహికల్స్ అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. 

ALSO READ :ప్రతిపక్షాల భేటీకి హాజరైతం: ఆప్​

ఇవి వెహికల్స్​ను తక్కువగా కొంటూ, అత్యవసర వస్తువుల దిగుమతులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. అయినప్పటికీ ఈ మార్కెట్లలో  వెహికల్స్​కు డిమాండ్ ఉందని మీనన్​ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్​లో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు 1,52,156 యూనిట్లుగా కాగా,  2022 ఏప్రిల్–-జూన్ కాలంలో ఇవి 1,60,116 యూనిట్లు. అంటే ఎగుమతులు ఐదుశాతం తగ్గాయి. ప్యాసింజర్ కార్ల షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి. యుటిలిటీ వెహికల్స్​ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో 55,419 యూనిట్లకు తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి. జూన్ క్వార్టర్​లో 62,857 యూనిట్ల షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లతో మారుతీ సుజుకి ఇండియా మొదటిస్థానాన్ని దక్కించుకుంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో 68,987 ప్యాసింజర్ వెహికల్స్​ను ఎగుమతి చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా మొదటి క్వార్టర్​లో 34,520 యూనిట్లను రవాణా చేసింది.