
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్ రెచ్చిపోయారు. మోటర్ సైకిల్ కిస్తీలు కట్టలేదని వాహనదారుడిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు అత్తాపూర్ పీఎస్కు పరుగులు తీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన ఫైనాన్షియర్స్ అతడిపై మళ్లీ దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించారు. బాధితుడి తరపు కొందరు వాదించగా.. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. అనంతరం దాడిలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
వెహికిల్ సీజింగ్ పేరుతో అడ్డగించి తనపై దాడి చేశారంటూ బాధితుడు నిస్సార్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. నిస్సార్ ఖాన్ మోటర్ సైకిల్ కిస్తీలు కట్టలేదని అడ్డగించి అడిగినందుకు.. కొందరు వ్యక్తులతో కలిసి తమపై దాడి చేశారంటూ ఫైనాన్షియర్స్ మరో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొందరు ఆటో మొబైల్ ఫైనాన్షియర్స్ వాహనాల సీజింగ్ పేరుతో.. నెంబర్ ప్లేట్ లేని మోటర్ సైకిళ్ల పై తిరుగుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.