
- స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో కక్ష్యలోకి ఎంట్రీ
- ఇయ్యాల సాయంత్రం ఐఎస్ఎస్తో డాకింగ్
వాషింగ్టన్: భారత మానవ సహిత అంతరిక్ష యాత్రకు ‘శుభా’రంభం అయింది. ఇండియన్ ఆస్ట్రోనాట్, భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్రాత్మక స్పేస్ జర్నీకి శ్రీకారం చుట్టారు. నాసా, యాక్సియం స్పేస్, ఇస్రో చేపట్టిన యాక్సియం–4 మిషన్ లో భాగంగా శుక్లా అంతరిక్షానికి చేరుకున్నారు. వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షానికి చేరుకున్న రెండో భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లనున్న తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ గా కూడా శుక్లా చరిత్రలో నిలవనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు (స్థానిక కాలమానం తెల్లవారుజామున 4 గంటలు) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్లా, మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ తో స్పేస్ఎక్స్ ఫాల్కన్-–9 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికి ఎగసింది. ప్రయోగం అనంతరం సరిగ్గా10 నిమిషాలకు క్యాప్సూల్ ను 200 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి రాకెట్ విజయవంతంగా చేర్చిందని నాసా, యాక్సియం స్పేస్ సంస్థలు ప్రకటించాయి.
క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతోందని, 28 గంటల జర్నీ తర్వాత గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)తో డాకింగ్ (అనుసంధానం) అవుతుందని వెల్లడించాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్ లు ఐఎస్ఎస్ లోకి ప్రవేశించనున్నారని తెలిపాయి. కాగా, కక్ష్యలోకి చేరిన వెంటనే ఆస్ట్రోనాట్లు తాము ఉన్న సరికొత్త క్రూ డ్రాగన్ క్యాప్సూల్ కు పెట్టిన పేరు ‘‘గ్రేస్” అని ప్రకటించారు. శుభాంశు అంతరిక్ష యాత్ర ప్రయోగాన్ని వీక్షించేందుకు దేశవిదేశాల్లో ప్రత్యేకంగా వాచ్ పార్టీలు నిర్వహించారు. కాగా, యాక్సియం–-4 మిషన్ తొలుత మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం, స్పేస్ఎక్స్ రాకెట్ లో టెక్నికల్ సమస్యల వల్ల ఇప్పటికి ఆరు సార్లు వాయిదా పడింది.
ఈ జర్నీ 140 కోట్ల భారతీయులది: శుక్లా
అంతరిక్షానికి చేరిన వెంటనే.. ‘‘కమాల్ కీ రైడ్ థీ.. (అద్భుతమైన జర్నీ)” అంటూ శుక్లా హిందీలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘నమస్కారం. నా ప్రియమైన దేశవాసులారా.. మనం 41 ఏండ్ల తర్వాత మళ్లీ అంతరిక్షానికి చేరుకున్నాం. ఈ జర్నీ చాలా అద్భుతంగా సాగింది. మేం భూమి చుట్టూ సెకనుకు 7.5 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతున్నాం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకం.. నేను మీ అందరితో ఉన్నానని చెప్తోంది. ఇది ఐఎస్ఎస్ కు నా జర్నీ ప్రారంభం మాత్రమే కాదు.. భారత మానవ సహిత అంతరిక్ష యాత్రకు కూడా ప్రారంభమే. ఈ జర్నీలో మీరంతా భాగస్వాములేనని అనుకుంటున్నా. మనమంతా కలిసి ఈ యాత్ర చేస్తున్నామని భావిస్తున్నా. జైహింద్, జై భారత్” అని పేర్కొన్నారు.
14 రోజులు.. 60 ఎక్స్ పరిమెంట్లు..
యాక్సియం-–4లో శుక్లా మిషన్ పైలట్గా, నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ మిషన్ కమాండర్ గా, పోలెండ్కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్ స్కీ విస్నీవ్ స్కీ, హంగరీకి చెందిన టిబోర్ కపూ మిషన్ స్పెషలిస్టులుగా ఉన్నారు. వీరు ఐఎస్ఎస్లో 14 రోజుల పాటు ఉండి 60 ఎక్స్ పరిమెంట్లు చేయనున్నారు. వీటిలో 7 ప్రయోగాలను ఇస్రో సైంటిస్టులు ప్రతిపాదించారు.
వెంట తీసుకెళ్లినవి
మామిడి తాండ్ర, క్యారెట్ హల్వా, మూంగ్ దాల్ హల్వాలను శుక్లా తన వెంట తీసుకెళ్లారు. ఐఎస్ఎస్లో తోటి యాత్రికులకు రుచిచూపిస్తానని చెప్పారు. సరస్వతీ దేవి వాహనమైన హంస బొమ్మ (జాయ్)ను కూడా తీసుకెళ్లారు. ఇది జీరో-గ్రావిటీ ఇండికేటర్గా పనిచేస్తుంది. అలాగే.. తన గురువు రాకేశ్ శర్మ గుర్తుగా ఒక సీక్రెట్ వస్తువును తీసుకెళ్తున్నట్లు శుక్లా చెప్పారు.
1984లో రాకేశ్ శర్మ.. ఇప్పుడు శుభాంశు శుక్లా
భారత్ తరఫున తొలిసారిగా వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షానికి వెళ్లారు. అప్పటి సోవియెట్ యూనియన్ (రష్యా) సల్యూట్–7 మిషన్ లో భాగంగా వెళ్లిన ఆయన 8 రోజుల పాటు కక్ష్యలో సల్యూట్–7 స్పేస్ స్టేషన్ లో గడిపి, భూమికి తిరిగి వచ్చారు. ఇప్పుడు మళ్లీ 41 ఏండ్ల తర్వాత భారత్ తరఫున శుక్లా అంతరిక్షానికి వెళ్లి, చరిత్ర సృష్టించారు. ఇస్రో తొలిసారి సొంతంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత, శిక్షణలో భాగంగా యాక్సియం–4 మిషన్ లో భాగస్వామి అయింది.